విశాఖపట్నంలోని రుషికొండలో ఉన్న హరిత రెస్టారెంట్ ను రూ.164 కోట్లతో బ్లూ బే హోటల్ గా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ తీరానికి కొట్టికొచ్చిన విదేశీ ఓడను లో ఫ్లోటింగ్ రెస్టారెంట్(షిప్ రెస్టారెంట్) ఏర్పాటుకు అన్ని అనుమతులు వచ్చాయని, వీలైనంత తొందరగా షిప్ కొనుగోలుకు చర్యలు తీసుకోనున్నామన్నారు. ఫ్లోటింగ్ రెస్టారెంట్ పనులు ప్రారంభించి, పర్యాటకలకు అందుబాటులో తీసుకురానున్నామన్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే నేపథ్యంలో పర్యాటక ప్రాంతాల్లో ఉన్న 33 బార్లలో విదేశీ మద్యంతో పాటు క్వాలిటీ ఉన్న బ్రాండ్లను ఈ బ్లార్లలో విక్రయించనున్నామన్నారు. ఈ మద్యాన్ని అధిక ధరలకు కాకుండా తక్కువ ధరలకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కడప జిల్లాలో ఉన్న గండికోటలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా హోటళ్లు, ఇతర సౌకర్యాల క్పలనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. హార్సలీ హిల్స్ తరహాలో గండికోటను అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వీటితో పాటు.. రాష్ట్రంలో 13 ప్రాంతాల్లో సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కరోనా కారణంగా ఆ పనులు ఆలస్యం చోటుచేసుకుందన్నారు. విశాఖ, తిరుపతిలో ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి ఒబరాయ్ హోటల్ యాజమన్యం ముందుకొచ్చిందన్నారు. అలాగే మిగిలిన ప్రాంతాల్లోనూ పీపీపీ పద్ధతిలో ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రపంచ పర్యాటక పటంలో ఏపీని నిలపాలన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లకు ఆహార పదార్థాలు సప్లయ్ చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 హోటళ్ల ద్వారా గతేడాది రూ.58.05 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది ఇప్పటి వరకూ రూ.28 కోట్ల మేర ఆదాయం ఆర్జించామన్నారు.