భారత దేశంలో తొలిసారిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వందేళ్ల తర్వాత ఏపీలోనే భూముల సమగ్ర సర్వే చేపడుతోందని ఎంతోప్రతిష్ట్మాకంగా చేపట్టాలని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈమేరకు గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకంపై సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఆధునిక టెక్నాలజీ, సచివాలయాల్లోని సర్వేయర్లు అందరినీ వినియోగించి
జూన్ 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తి చేయాలన్నారు. సర్వేను అత్యంత ప్రాధాన్య అంశంగా చేపట్టాలన్న సీఎం అవినీతి రహితంగా, ఆదర్శవంతంగా సర్వే ప్రక్రియ ఉండాలని సూచించారు. సర్వేచేసిన వెంటనే గ్రామాల వారీగా మ్యాపులతో సహితం రికార్డులు అప్డేట్ కావాలన్నారు. ఆ భూమి కార్డులను రైతులకు ఇవ్వాలని, అనుకున్న సమయంలోగా సర్వేను పూర్తిచేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. డ్రోన్లు సహా ఇతర టెక్నికల్ మెటీరియల్ను అవసరమైన మేర కొనుగోలు చేయాలని, దీనికోసం అవసరమైన సాప్ట్వేర్ను సమకూర్చుకోవాలన్నారు.
సర్వేలో పాల్గొంటున్న సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ ఇవ్వండంతోపాటు, దీనికోసం నిపుణుల సేవలు వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.ఇంత పెద్ద ఎత్తున చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది, వారికి తగిన శిక్షణ ఇలా అన్ని అంశాలతో సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని సీఎం సూచించారు.
అనంతరం అధికారులు మాట్లాడుతూ, అనుకున్న సమయానికి కచ్చితంగా సమగ్ర భూసర్వే పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా ఏపీని కచ్చితంగా దేశంలో మొదటి స్ధానంలో నిలబెడతామన్న అధికారులు సీఎంకి తెలియజేశారు. సమగ్ర భూసర్వేపై ఏర్పాటైన కేబినెట్ సబ్కమిటీ ప్రతివారం కచ్చితంగా సమావేశం కావాలని సీఎం ఆదేశించారు. రోజుకు ఒక్కో ప్లాంట్లు నుంచి 4వేలు చొప్పున రోజుకు 16వేల సర్వేరాళ్లు ఉత్పత్తి చేస్తామని భూగర్భగనులశాఖ అధికారులు తెలియజేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, రెవెన్యూశాఖ కమిషనర్ సిద్దార్ధజైన్, ఏపీఎండీసీ వీసీ అండ్ ఎండీ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.