రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు..కలెక్టర్


Ens Balu
6
Rajahmundry
2022-04-08 16:04:07

తూర్పుగోదావరి  జిల్లాలో నాడు - నేడు పనులతో పాటు 84 అదనపు తరగతి గదులు నిర్మాణంతో కలిపి , మొత్తం 49 పాఠశాలల్లో  133 పనులను సుమారు రూ.100 కోట్లతో చేపట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత తెలిపారు. శుక్రవారం సాయంత్రం విద్యా శాఖ పై స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో  నాడు నేడు ద్వారా రెండవ ఫేజ్ లో చేపట్టవలసిన పనులకు సంబంధించి మండలవారి అధికారులతో సమీక్షించి పలు సూచనలు అందించారు. చేపట్టే పనుల్లో నాణ్యత కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లాలో నాడు నేడు రెండవ ఫేజ్ లో 49 పాఠశాలలను ఆధునీకరణ త్వరితగతిన చేపట్టాలన్నారు. అదేవిధంగా 84 అదనపు తరగతి గదులను పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తరచు పాఠశాలలను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులకు అందుబాటులో ఉండే  త్రాగు నీరు, టాయిలెట్స్ అపరిశుభ్రంగా వున్నట్లు అయితే సంబంధించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలో జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి రానున్నారని సూచన ప్రాయంగా తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన తేదీలోగా ప్రతి అధికారి వారికి కేటాయించిన , నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.

అంతకుముందు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెండో దశ నాడు నేడు అభివృద్ధి పనులు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు తలపించేలా ఉండాలన్నారు. నూతనంగా భాద్యతలు చేపట్టిన కలెక్టర్ లను అభినందిస్తూ, ఇంజినీరింగ్ అధికారులు పనులను నిబద్ధతతో చేపట్టాల్సి ఉందన్నారు. రెండో దశలో అదనపు తరగతి గదుల నిర్మాణం, ఇతర కపోనెంట్స్  కలిసి ఉన్నందున పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ లు పాఠశాలలు తనిఖీ చేసి, విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించాలన్నారు. ఈ సమావేశానికి డీఈఓ  ఎస్. అబ్రహం, ఎమ్ ఈ ఓ లు,  పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఏ పి డబ్ల్యు ఐ డి సి, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు హాజరయ్యారు.