ఆలు లేదు.. సూలు లేదు.. కొడుపేరు మాత్రం సోమలింగం అన్నాడ వెనకటకి ఓ వికటకవి.. సరిగ్గా అదే విధానాన్ని పాటిస్తున్నది ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం.. గ్రామ, వార్డు సచివాలయాల్లోని సిబ్బందిని కుదించడానికి ప్రవేశపెట్టిన క్లస్టర్ విధానానికంటే ముందుగా నోటిఫై చేసిన పోస్టులను రద్దు చేస్తున్నట్టు జాబితాలు సిద్దం చేసిన ప్రభుత్వం.. సదరు క్లస్టర్ లో రద్దు చేసిన పోస్టులు, ఖాళీగా ఉన్న క్లస్టర్ లలో ఉద్యోగులను నియమించకుండానే సాధారణ బదిలీలకు తెరలేపింది. అలాగని క్లస్టర్ విధానమూ అమలు చేయలేదు..మరో ప్రక్క గాల్లో ఉన్న సచివాలయ ఉద్యోగులను ఈ శాఖకు బదిలీ చేస్తున్నది కూడా చెప్పలేదు.. ముఖ్యంగా సచివాలాయల్లో మహిళా పోలీసుల పోస్టులను రద్దు చేసే సమయంలో వారి అర్హతలను బట్టి వారిని సముచిత స్థానాల్లో కూర్చోబెడతామని చెప్పిన హోం మంత్రి అనిత.. ఇపుడు గాల్లో పెట్టిన పోస్టుల విషయంలో ప్రభుత్వం ముందు ఏ విషయమూ తేల్చలేదు.. హోంశాఖకు చెందిన మహిళా పోలీసుల పోస్టులు గాల్లోనే ఉన్నా అటు ప్రభుత్వం దగ్గర గానీ, ఇటు జిల్లా కలెక్టర్ల వద్ద గానీ ప్రస్తావన తేవకపోవడంతో మహిళా పోలీసలు తమ పరిస్థితి ఏంటంటూ తలలు పట్టుకుంటున్నారు. తమను ఎక్కడికి విసిరేస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు..!
వైఎస్సార్సీపీ ప్రభుత్వమే గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగుల విషయంలో తేడాగా వ్యవహరించందునుకుండే దానికి రెండు రెట్లు కూటమి ప్రభుత్వం అంతకంటే దారుణంగా వ్యవహరిస్తుందనే విషయం రద్దు చేసిన పోస్టులను గాల్లో ఉంచి, వారి సంగతి తేల్చకుండా సాధారణ బదిలీలకు తెరలేపిన కూటమి ప్రభుత్వ వైఖరి స్పష్టం చేస్తున్నది. రెండు సచివాలయాలను కలిపి ఒక క్లస్టర్ గా చేయాలని ప్రతిపాదించి.. దానిని అమలు చేయకుండానే కొన్ని సచివాలయ పోస్టులను రద్దు చేసి జాబితాలు విడుదల చేసింది. అందులో అన్ని కేటగిరీలకు చెందిన ఉద్యోగులతోపాటు అధికంగా మహిళా పోలీసులే అధికంగా ఉన్నారు. వాస్తవానికి క్లస్టర్ విధానం కోసం ఉన్న పోస్టులను రద్దుచేసి జాబితా విడుదల చేశారు గనుక వారికి ముందుగా ఏ క్లస్టర్ లో ఖాళీలు ఉన్నాయో అక్కడ రద్దు చేసిన పోస్టులతో నిర్ధేశించిన పోస్టులను భర్తీచేయాల్సి వుంటుంది.
ఆపై సాధారణ బదిలీలు చేపడితే గాల్లో ఉంచిన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది వచ్చేది కాదు. కానీ దానికి వ్యతిరేకంగా క్లస్టర్ పేరు చెప్పి... పోస్టులను రద్దు చేస్తున్నట్టు రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 15వేల 4 గ్రామవార్డు సచివాలయాకు సందించిన సుమారు 1.30 లక్షల ఉద్యోగుల్లో 20శాతం పోస్టులను రద్దు చేసి జాబితాలు తయారు చేసి సచివాలయాలకు కూడా పంపేసి వారిని గాలిలో పెట్టింది. క్లస్టర్ గా చేస్తామన్న సచివాలయాల్లో మహిళా పోలీసుల పోస్టులు ఖాళీలు ఉన్నా.. గాల్లోపెట్టిన వారిని మాత్రం ఎక్కడా నియమించకుండానే సాధారణ బదిలీలకు అందరు ఉద్యోగులను దరఖాస్తు చేసుకోవాలని జీఓ జారీ చేశారు. దానితో అందరూ ఇపుడు సాధారణ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో గాల్లో ఉన్న మహిళా పోలీసులకు బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే గత సారి జరిగిన అభ్యర్ధన బదిలీల్లో చాలా మంది మహిళా పోలీసులకి బదిలీలు జరిగిపోయాయి.
అలా వచ్చినవారిని ప్రస్తుతం పోస్టులు రద్దు చేసిన వారిలో ఎక్కువమందిని జాబితాల్లోకి చేర్చారు. సదరు క్లస్టర్ లలో ఖాళీలు ఉన్నా వారిని నియమించకుండా అలానే వదిలేశారు. దీనితో వారి బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. గత ఏడాది బదిలీలపై వచ్చిన వారు ప్రస్తుత సాధారణ బదిలీల్లో దరఖాస్తు చేసుకోవడానికి లేదు. అలాగని క్లస్టర్ వ్యవస్థ కూడా అమలు కాలేదు. ఈ రెండూ జరక్కపోవడంతో రద్దైన పోస్టుల్లో మహిళా పోలీసులందరూ ఇంకా గాల్లోనే ఉన్నారు. బదిలీలు జరిగితే ఖాళీలన్నీ బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నవారు కోరుకుని జాయిన్ అయిపోతారు. ఇటు చూస్తే రద్దైన పోస్టులను గాల్లోనే ఉంచి వీరిని ఏం చేస్తారో ప్రభుత్వం చెప్పడం లేదు. బదిలీల ప్రక్రియ పూర్తయిపోతే.. ఎక్కడో సుదూరాన ఉన్న ఖాళీల్లోకే గాల్లో ఉన్న మహిళా పోలీసులకు పోస్టింగులు ఇవ్వాల్సి వస్తుంది. అది ఉమ్మడి జిల్లాలో ఎక్కడ ఖాళీ ఏర్పడుతుందో.. వీరిని ఎక్కడ నియమిస్తారో.. అసలు రద్దు చేసిన పోస్టుల్లో ఉన్నవారిని సచివాలయాల్లో నియమిస్తారో లేదో కూడా వీరికి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు.
మహిళా పోలీసులకు ప్రస్తతం ఏ ప్రభుత్వశాఖ లేనప్పటికీ వారి నియామకాలన్నీ పోలీసుశాఖ ద్వారానే జరిగాయి. వాస్తవానికి క్లస్టర్ విధానంలో రద్దైన పోస్టులు ఏం చేస్తారనే విషయాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత ప్రభుత్వం ముందు, గ్రామ, వార్డు సచివాలయశాఖ ముందు పెట్టి ప్రస్తావించాల్సి వుంది. కానీ ఇక్కడ ఆపని కూడా జరగలేదు. అలాగని ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల వద్దకు మహిళా పోలీసులు, పోస్టులు రద్దైన సచివాలయ ఉద్యోగులు వెళ్లి మొర పెట్టుకుంటే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనపుడు మేము మాత్రం ఏం చేయగలమని చేతులెత్తేస్తున్నారు. కానీ డిఎస్సీ నియామకాలు చేసిన చైర్మన్, జిల్లా కలెక్టర్లు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లొచ్చు. కానీ కలెక్టర్లు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు.
ఇదే విషయమై విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్ ను చరవాణిలో ఈరోజు-ఈఎన్ఎస్ వివరణ కోరిణా దానికి సమాధానం రాలేదు. ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సాధారణ బదిలీలు చేపట్టక ముందే రద్దు చేసిన పోస్టుల్లోని వారికి ఒక క్లారిటీ ఇవ్వడమో.. లేదంటే ఖాళీలు ఉన్నచోట క్లస్టర్ లోకి వెళ్లే చోట రద్దు చేసిన పోస్టుల్లోని వారిని భర్తీచేయడమో చేయాలి. లేదంటే సాధారణ బదిలీల సమయంలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఇతర ప్రాంతాలు కోరుకున్నవారు వచ్చి చేరిపోయి.. ప్రస్తుతం పనిచేస్తున్నవారికి తీవ్ర నష్టం కలిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..!