డా.YSR మత్స్యకార భరోసా వినియోగించుకోవాలి.. ఫిషరీష్ డిడి
Ens Balu
11
Bhogapuram
2022-04-15 11:26:22
డా.వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని మత్స్యకారులంతా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని విజయనగరం జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి సూచించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లాలోని పూసపాటి రేగ, భోగాపురం మండలాల్లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారులకు అందించే డా.వైఎస్సార్ మత్స్యకార భరోసాపై అధికారులు, సిబ్బందితో కలిసి మత్స్యకారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా ఒకేరోజు(ఏప్రిల్ 16న) ఈ మత్స్యకారుల గుర్తింపు జరగనుందని చెప్పారు. దాని కోసం మత్స్యకారులు బోటు, బోటు రిజిస్ట్రేషన్(బోటు యజమాని తేవాల్సి వుంటుంది), ఫిషింగ్ లైసెన్స్(బోటు యజమాని తేవాల్సి వుంటుంది), ఆధార్ కార్డు, రైస్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ మొదటి పేజి, ఫోన్ నెంబర్లతో సర్వే జరిగే రోజు మత్స్యకారులు అంతా సిద్దంగా ఉండాలని సూచించారు. అదే సమయంలో మత్స్యకార లబ్దిదారుడు అర్చకులు, చేదోడు, రైతు భరోసా, విద్యాదీవెన, వసతి దీవెన, వాహనమిత్ర, కాపునేస్తం, నేతన్న నేస్తం, పాస్టర్, వైఎస్సార్ చేయూత మరే ఇతర ప్రభుత్వ పథకాలు కూడా పొందకుండా ఉండేవారు మాత్రమే ఈ వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకానికి అర్హులని తెలియజేశారు. లబ్దిదారుడు 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉండి, గ్రామీణ ప్రాంతంలో అయితే రూ.1.20లక్షలు ఆదాయం, పట్టణ ప్రాంతంలో అయితే రూ.1.44లక్షల ఆదాయం మించకుండా ఉండాలని, అదే సమయంలో కుటుంబంలో ఎవరికీ నాలుగుచక్రాల వాహనాలు కలిగి ఉండకూడదని, విద్యుత్ కనెక్షన్ 300 యూనిట్లు దాటకుండా ఉండాలని అదీ కూడా దీనిని ఆరు నెలల విద్యుత్ చార్జీలు పరిగణలోకీ తీసుకుంటారని, మున్సిపల్ ప్రాంతంలో వెయ్యి చదరపు గజాల్లోపు ఇంటిలో నివాసం ఉండాలని, ఈ కుటుంబాల్లో ఎవరైనా ప్రభుత్వ పించను తీసుకుని ఉండకూడదని, మరీ ముఖ్యంగా మత్స్యాకార కుటుంబాల్లో ఎవరూ ఆదాయపు పన్ను చెల్లించి ఉండకూడదని తెలియజేయశారు. ప్రభుత్వం పొందు పరిచిన నిబంధనలను సర్వే చేపట్టే మత్స్యశాఖ సిబ్బంది, అధికారులు పరిగణలోకి తీసుకుంటారని పేర్కొన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా అర్హులైన లబ్దిదారులు సర్వే సమయంలో అన్ని రకాల పత్రాలు, వాటి జెరాక్సులతో సిద్దంగా ఉండాలని మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి మత్స్యకారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు, మత్స్యశాఖ అధికారులు, గ్రామీణ మత్స్య సహాయకులు, అధిక సంఖ్యలో మత్స్యకారులు పాల్గొన్నారు.