తిరుమలలో భక్తుల కోసం వేసవి ఏర్పాట్లు..


Ens Balu
3
Tirumala
2022-04-18 15:42:12

కోవిడ్ వ్యాప్తి తగ్గడం, వేసవి సెలవులు మొదలుకావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరు గుతోందని, ఇందుకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, భక్తులు ఎలాంటి సంకోచం లేకుండా శ్రీ‌వారి దర్శనానికి రావచ్చని టిటిడి అదనపు ఈఓ  ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా అదనపు ఈఓ మాట్లాడుతూ శ్రీవారి సర్వదర్శనం కోసం 7 నుంచి 8 గంటల సమయం పడుతోందని, కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లు, షెడ్ల‌లో వేచి ఉండే భక్తులకు నిరంత‌రాయంగా పాలు, అల్పాహారం, అన్నప్రసాదాలు అందిస్తున్నామని తెలిపారు. కోవిడ్ సమయంలో వివిధ విభాగాల్లో సిబ్బందిని కుదించి ఇతర విభాగాలకు పంపామని, ప్రస్తుతం సిబ్బందిని తిరిగి ఆయా విభాగాలకు రప్పించి భక్తులకు సేవలు  అందిస్తున్నామని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు భక్తుల సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారన్నారు. సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని గత వారంలో నాలుగు రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేశామన్నారు. సోమవారం నుండి బ్రేక్ దర్శనాలు తిరిగి ప్రారంభించామన్నారు. శ్రీవారి ఆలయంలో క్యూలైన్ క్రమబద్ధీకరిస్తూ తోపులాట లేకుండా స్వామివారి దర్శనం కల్పిస్తున్నట్టు చెప్పారు.

         మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతోపాటు క్యూలైన్లు, ఫుడ్ కౌంటర్లలో భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతోందన్నారు. రాంభగీచా బస్టాండు, సిఆర్వో, ఏఎన్సి తదితర ప్రాంతాల్లో ఫుడ్ కౌంటర్ల ఏర్పాటుతో భక్తులు అన్నప్రసాద కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా ఆయా ప్రాంతాల్లోనే అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారని తెలిపారు. పిఎసి-2, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 క్యాంటీన్లో అన్నప్రసాదాల తయారీకి, వడ్డించేందుకు కలిపి 185 మంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నామన్నారు. భక్తులు సంచరించే అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ఆర్వో సురక్షిత తాగునీరు అందుబాటులో ఉంచామన్నారు. ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్ మెంట్లు ఖాళీ అయిన వెంటనే ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసి సిద్ధంగా ఉంచుతున్నారని తెలిపారు. భక్తులు తిరిగే అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం మెరుగైన ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు.   విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో క్యూలైన్ల క్రమబద్దీకరణతో పాటు భక్తుల లగేజీని కౌంటర్ల ద్వారా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారని వివరించారు. ఇందుకోసం దాదాపు 100 మంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. ప్రధాన కల్యాణకట్టతో పాటు మినీ కల్యాణకట్టల్లో క్షురకులు 24 గంటల పాటు భక్తులకు సేవలు అందిస్తున్నారని తెలియజేశారు. కోవిడ్ సమయంలో 400 మంది క్షురకులు సేవలు అందిస్తుండగా, ప్రస్తుతం 1200 మంది సిబ్బంది భక్తులకు తలనీలాలు తీస్తున్నారని తెలిపారు. కల్యాణకట్టలో శుభ్రం చేసేందుకు 40 మంది అదనపు సిబ్బందిని సమకూర్చుకున్నామని తెలిపారు. రిసెప్షన్ విభాగంలో గదులు ఖాళీ అయిన 20 నిమిషాల్లో శుభ్రం చేసి భక్తులకు కేటాయిస్తున్నారని చెప్పారు.

         ఏప్రిల్ 11 నుండి 17వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల‌లో భ‌క్తుల‌కు అందించిన వివిధ సేవ‌ల వివ‌రాల‌ను ధ‌ర్మారెడ్డి వివ‌రించారు.

- శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న భ‌క్తుల సంఖ్య - 5,29,926

- ల‌డ్డూ ప్ర‌సాదం - 24,36,744

- వ‌డ‌లు - 25,921

- త‌ల‌నీలాలు స‌మ‌ర్పించిన భ‌క్తుల సంఖ్య - 2,39,287

- అన్న‌ప్రసాదాలు స్వీక‌రించిన భ‌క్తుల సంఖ్య - 10,55,572

- అశ్వ‌ని ఆసుప‌త్రిలో వైద్యసేవ‌లు పొందిన భ‌క్తుల సంఖ్య - 10,768

- భ‌క్తులకు కేటాయించిన గ‌దులు - 30,650

- భ‌క్తులకు కేటాయించిన లాక‌ర్లు - 20,541

- ల‌గేజి కౌంట‌ర్ల ద్వారా డిపాజిట్ చేసుకున్న సెల్‌ఫోన్లు, ల‌గేజి బ్యాగులు - 5,72,756

- తిరుప‌తి - తిరుమ‌ల మ‌ధ్య ప్ర‌యాణించిన వాహ‌నాలు - 46,419

- శ్రీ‌వారి సేవ‌కులు తిరుమలలో - 1700 , తిరుపతిలో - 300, పరకామణి సేవ - 200.

           మీడియా స‌మావేశంలో ఎస్ఇ-2  జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, డెప్యూటీ ఈవోలు  హ‌రీంద్ర‌నాథ్‌,  సెల్వం, భాస్క‌ర్‌, విజివో  బాలిరెడ్డి, పేష్కార్  శ్రీ‌హ‌రి పాల్గొన్నారు.