5.09 లక్షల ఇళ్లకు మంచినీటి కుళాయిలు..


Ens Balu
2
Ongole
2021-07-06 12:15:37

గ్రామీణ ప్రాంతాల్లో  5.09 లక్షల గృహాలకు ట్యాప్ కనెక్షన్ల ద్వారా తాగునీరు సరఫరా చేయడానికి ప్రణాళిక రూపొందించామని జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ చెప్పారు. జల జీవన్ మిషన్ కింద గ్రామీణ నీటి సరఫరాపై  జిల్లాస్థాయి ప్రణాళిక కమిటీ సమావేశం మంగళవారం స్థానిక ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్ లో జరిగింది. జల జీవన్ మిషన్ కింద గ్రామాలలో ప్రతి గృహానికి సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యంతో పనిచేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.  ప్రస్తుతం 5.09 లక్షల గృహాలకు నీరు అందించాలని రూ.889.44 కోట్లతో ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి నివేదించామన్నారు. నీటి సరఫరా వ్యవస్థ నిర్మాణం కోసం రూ.36.97 కోట్లతో ప్రణాళిక రూపొందించగా,  రూ.490.20 కోట్లతో పైప్ లైన్ల నిర్మాణం చేపట్టాలని,  రూ.190.70 కోట్లతో ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించాలని ప్రణాళిక రూపొందించామన్నారు.  నూతనంగా నీటి వనరుల ఏర్పాటు కోసం రూ.56.17 కోట్లు, కొత్తగా ట్యాంకులు నిర్మించడానికి రూ.44.41 కోట్లు, మరో రూ.70.99 కోట్లు అనుబంధంగా వివిధ పనులకు నిధులు వెచ్చించాలని సమగ్ర ప్రణాళికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించిన విషయాలను ఆయన వివరించారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం జల జీవన్ మిషన్ కింద 2024 సంవత్సరం వరకు రూ 527.17 కోట్లు మంజూరు చేస్తూ అధికారికంగా అనుమతులిచ్చిందన్నారు.
            జల వనరులు తక్కువగా ఉన్న ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్యలు రాకుండా అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని కలెక్టర్ చెప్పారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జల జీవన్ మిషన్ కింద రానున్న మార్చి నాటికి ఒక లక్ష, 62వేల, 330 గృహాలకు నీటి కనెక్షన్ లు ఇవ్వడానికి రూ.227.27 కోట్లు వెచ్చించాలని ప్రణాళిక రూపొందించినట్లు ఆయన వివరించారు. ఈ పనులు ఇప్పటివరకు11.66 శాతం పురోగతిలో ఉన్నాయన్నారు. గడిచిన మూడు నెలలలో రూ.3.03 కోట్ల నిధులు వెచ్చించి 18,930 గృహాలకు ట్యాప్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలలో నీటి సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించాలని ఆయన సూచించారు.  గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు జల జీవన్ మిషన్ కింద స్వచ్ఛమైన తాగునీరు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీటి సరఫరాలో ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. పైపులైన్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆయన సూచించారు. నిర్మాణ పనుల పరిశీలనకు సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్ లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. వారంతా నిరంతరం పర్యవేక్షించేలా చూడాలన్నారు. ప్రజలకు సరఫరా చేస్తున్న తాగునీటి నాణ్యతను  గుర్తించే ల్యాబ్ లు సమర్థంగా పనిచేయాలన్నారు. గతేడాది లక్ష్యంలో 65.04 శాతం పురోగతి సాధించిన విషయాలను ఆయన గుర్తు చేశారు. రూ.260.19  కోట్ల నిధులతో  95,456 గృహాలకు ట్యాప్ కనెక్షన్ లు ఇవ్వగలిగామని ఆయన తెలిపారు.

సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) టి. ఎస్. చేతన్, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈ మర్థన్ఆలీ,  జడ్పీ సీఈఓ దేవానందరెడ్డి, డ్వామా పి.డి.  శీనారెడ్డి, డిఆర్డీఏ పిడి బి.బాబురావు,  ఆర్ డబ్ల్యూఎస్ డీఈ మహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.