విశాఖజిల్లాలో నమోదైన ఎస్ సి, ఎస్ టి అట్రాసిటి కేసులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాల్సిందిగా జిల్లాకలెక్టర్ మరియు జిల్లా విజిలెన్స్ మరియు మోనటరింగ్ కమిటీ చైర్మన్ వి.వినయ్ చంద్ సంబందిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి విజిలెన్స్ మరియు మోనటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ లో జరగవలసిన త్రైమాసిక సమావేశం కోవిడ్ ఉదృతంగా ఉండడంతో అధికారులందరు కోవిడ్ విదులలో ఉన్నందున నిర్వహించలేదన్నారు. ఎస్ సి, ఎస్ .టి కేసులు తక్కువ గా నమోదై రాష్ట్రంలో మన జిల్లా రెండవ స్థానంలో నిలిచిందన్నారు. డి ఆర్ ఓ, జాయింట్ కలెక్టర్, పోలీస్ కార్యాలయాలకు అట్రాసిటి కేసులకు సంబందించి సమస్యల పిటీషన్లు సమయంతో సంబందం లేకుండా వేరు వేరుగా వస్తున్నాయన్నారు. ఆ విదంగా కాకుండా డి ఎస్ పి, ఎస్ సి, ఎస్ టి సెల్ రూరల్ మరియు అర్భన్ కార్యాలయాలకు అందిన ఫిర్యాదులను వారాంతపు నివేదికలాగ తయారు చేసి పంపించాలన్నారు. ఎప్పటి కప్పుడు ఆర్ డి ఓ లు, డి ఎస్ పి లు ఎఫ్ ఐ ఆర్, చార్జిసీట్ లకు సంబందించిన కేసులను గూర్చి సమీక్షించు కోవాలన్నారు. చాలా మండలాలలో కులదృవీకరణ పత్రాలకు సంబందించి పెండింగులో ఉన్నట్లు తమ దృష్టికి వచ్చాయని ఆర్ డి ఓ లు వాటన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి వారంరోజులు లోగా పరిష్కరించాలని ఆదేశించారు.
ఎస్ సి, ఎస్ టి అట్రాసిటి కేసులకు సంబందించి 60 రోజులు లోగా విచారణ పూర్తి చేసి చార్జిషీట్ పైలు చేయాలన్నారు. ఎఫ్ ఐ ఆర్ నుండి చార్జిషీట్ మధ్యలో ఎక్కువ సమయం లేకుండా చూడాలన్నారు. . ఎఫ్ ఐ ఆర్ పూర్తి అవగానే బాదితులకు పేమెంట్ చేయాల్సి ఉంటుందన్నారు. అత్యాచారం, హత్యలకు సంబందించి అదనపు రిలీఫ్ పేమెంట్ అందజేయాలన్నారు. సబ్ డివిజన్ స్థాయిలో ఈ నెల 31వ తేదీ లోపల విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని ఆదేశించారు. ఎస్ సి , ఎస్ టి అట్రాసిటి కేసుల బాదితులకు అందించాల్సిన రిలీఫ్ పేమెంట్ లను సంబందిత డి ఎస్ పిలు కన్సాలిడేట్ చేసి తీసుకొని వస్తే నిర్థిష్టసమయంలో పేమెంటు చేసే అవకాశం ఉంటుందన్నారు. సాంఘీక సంక్షేమ శాఖ జాయింట్ డైరక్టర్ ఆర్ వి రమణమూర్తి మాట్లాడుతూ జిల్లాలో ఇన్విష్టిగేషన్ పరిదిలో UI 219 కేసులు , PT 697 కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. పట్టణ పరిదిలో 511, గ్రామీణ పరిదిలో 186 UI కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో శాసన సభ్యులు శెట్టి ఫల్గుణ, కె. భాగ్యలక్ష్మి, జి.వి.ఎం .సి కమిషనర్ జి.సృజన, రూరల్ ఎస్ పి కృష్ణారావు, జాయింట్ కలెక్టర్లు వేణు గోపాలరెడ్డి, పి.అరుణ్ బాబు, ఆర్. గోవిందరావు, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఆర్. గోపాల కృష్ణ, పాడేరు సబ్ కలెక్టర్ అబిషేక్, విశాఖపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం ఆర్ డి ఓ లు పెంచల కిశోర్, సీతారామారావు, అనిత, పోలీస్ అధికారులు, DVMC మెంబర్లు పూండి మల్లేశ్వరరావు, ఏసేబు, సత్యం తదితరులు హాజరయ్యారు.