రక్తదానం చేసి ఆపదలో వున్నవారి ప్రాణాలు కాపాడాలని విశాఖ నగర పాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. బుధవారం ఓలిశెట్టి సత్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఆమె 3వ జోన్ 19వ వార్డు పరిధిలోని పెద్ద జాలరిపేటలో ఓలిశెట్టి సత్య ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆ సంస్థ ఏర్పాటు చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, అన్ని దానాల కంటే రక్త దానం గొప్పదని, కరోనా వైరస్ కారణంగా రక్తదానం చేసే వారు తక్కువగా ఉన్నందున రక్త నిల్వలు తగ్గుతున్నాయని ఇటువంటి కష్ట కాలంలో చారిటబుల్ సంస్థ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిందని, రక్తదానం వలన ఎంతోమంది ప్రాణాలను కాపాడగలమని తెలిపారు. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ నకు దాదాపు 200 మంది యువత నేడు రక్తదానం చేశారని, మరింత మంది రక్తదానం చేయాలని యువతకు మేయర్ పిలుపునిచ్చారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఓలిశెట్టి సత్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ చైర్మన్ ఓలిశెట్టి గురునాథంకు మేయర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంనకు మత్స్యశాఖ చైర్మన్ కోలా గురువులు, కార్పొరేటర్ బెహరా భాస్కర్, స్వచ్ఛ భారత్ అంబాసిడర్ రమణ మూర్తి, వైయస్సార్ సిపి నాయకులు అక్కరమాని వెంకటరావు, పేడాడ రమణ కుమారి తదితరులు పాల్గొన్నారు.