శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి టిటిడి సారె..


Ens Balu
3
Tirupati
2021-08-02 16:40:29

తిరుత్తణి శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరపున పట్టు వస్త్రాలను టిటిడి అద‌న‌పు ఈవో  ఎ.వి.ధ‌ర్మారెడ్డి సోమ‌వారం సమర్పించారు. టిటిడి ఆధికారులకు తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి ఆలయ ఛైర్మన్‌  జయశంకర్‌, దేవాదాయ శాఖ‌ జాయింట్ కమిషనర్  ప‌రంజ్యోతి ఇతర ఆధికారులు ఘనస్వాగతం పలికి పట్టు వస్త్రాలను స్వామివారికి అలంకరించారు. కాగా భారతదేశంలోనే ప్రసిద్ది గాంచిన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో తిరుత్తణి అత్యంత ప్రముఖమైనది. ఈ పుణ్యక్షేత్రంలోని శ్రీసుబ్రహ్మణ్యస్వామి తన ఇరువురు దేవేరులలో ఒకరైన  శ్రీ వళ్ళీని పరిణయం ఆడినట్లు పురాణ ప్రశస్త్యం. టిటిడి 2006 నుండి ఆడికృత్తికను పురస్కరించుకుని శ్రీ సుబ్రమణ్యస్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆచారంగా వస్తుంది.   తిరుపతి పుణ్యక్షేత్రం నుండి సుమారు 50 కి.మీ. దూరంలో తమిళనాడు రాష్ట్రంలో వెలసివున్న ఈ దివ్యక్షేత్రం తమిళులు అత్యంత భక్తి పూర్వకంగా స్తుతించే ''ఆరుపడైవీడు'' లో ఒక్కటి. సురపద్ముడనే అసురుని సంహరించి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ తన ఉభయదేవేరులైన శ్రీవళ్ళీ, దేవయాని అమ్మవార్ల సమేతంగా తనికేశన్‌గా వెలసి భక్తులచే పూజలు అందుకొంటున్నారు.  ఈ క్షేత్ర ప్రాశస్త్యంలో మరొక ముఖ్యమైన చారిత్రక నేపధ్యానికి వస్తే ఇక్కడ వెలసి వున్న పుష్కరిణిలో (నంది నది) సర్పరాజు వాసుకి స్నానం ఆచరించి సముద్ర మధనం సమయంలో మందర పర్వతానికి తనను తాడుగా ఉపయోగించి దేవాసురులు అమృతం కోసం చిలుకుతున్నప్పుడు ఏర్పడిన గాయాల నుండి ఉపశమనం పొందాడు. ఈ ఆలయంలో నిర్వహించే అనేక ఉత్సవాలలో ఆడికృతిక అత్యంత ప్రముఖమైనది. ఈ సందర్భంగా భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో పూలతో అలంకరించిన కావడులను ఎత్తుకు వెళ్ళి మొక్కుబడలు చెల్లించడం విశేషం.