7న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి రాక..


Ens Balu
3
Srikakulam
2021-08-05 15:46:26

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 7వ తేదీన జిల్లాకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురు వారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 7 వ తేదీన  జాతీయ చేనేతకారుల దినోత్సవం అని, ఆ కార్యక్రమంలో పాల్గొనటానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వస్తున్నారని వివరించారు. పొందూరులో జాతీయ చేనేతకారుల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు. పొందూరులో ఆంధ్రా ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ది సంఘం సంస్థను సందర్శిస్తారని అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో లబ్దిదారులతో ముఖాముఖి కార్యక్రమం, వివిధ పథకాల క్రింద సహాయక కార్యక్రమాల పంపిణీ జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు. మార్కెట్ యార్డు ప్రాంగణంలో ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు 50 వరకు ప్రదర్శన శాలలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన అన్నారు. ప్రతి అంశాన్ని పక్కాగా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, కే.శ్రీనివాసులు, హిమాంశు కౌశిక్, అర్. శ్రీరాములు నాయుడు, డిఆర్ఓ బలివాడ దయానిధి, ఆర్డీఓ ఐ.కిషోర్, డిఎస్పి ఎం. మహేంద్ర, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ హెచ్. కూర్మ రావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, డిఅర్డిఏ పిడి బి.శాంతి, ఎల్.డి.ఎం జివిబిడి హరిప్రసాద్, డిఎంహెచ్ఓ కే. సి. చంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.