సామాన్య,మధ్య తరగతి ప్రజలకు మేలు చేకూరే విధంగా విఎంఆర్డిఎ పనిచేస్తుందని ఆ సంస్థ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల అన్నారు. సోమవారం డాబాగార్డెన్స్ ప్రెస్క్లబ్లో వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గతంలో తాను భీమిలి మున్సిపల్ చైర్పర్సన్గా, కౌన్సిలర్గా, నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశానన్నారు. గత ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గతంలో కంటే ఓట్ల శాతం పెంచగలిగానన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఇతర పెద్దలు పార్టీకి తాను అందించిన సేవలను గుర్తించి బీసీ మహిళగా తనకు కీలకమైన విఎంఆర్డిఎ చైర్మన్ పదవిని అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి ఆశయ సాధనకు అనుకూలంగా తన శక్తిని మించి పనిచేస్తానన్నారు. వీఎంఆర్డీఏ పరిధిలోని జిల్లాల ప్రజలకు మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా కృషి చేస్తానని చెప్పారు. ఇప్పటికే సుమూరు రూ.186కోట్ల ప్రాజెక్టులు పూర్తి కావచ్చి, ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయన్న చైర్మన్ భవిష్యత్లో మరిన్ని ప్రాజెక్టులు చేపట్టే విధంగా అధికారులు ప్రణాళికలు సిద్దం చేశారన్నారు. ఎన్ఎడి ప్లైఓవర్, మల్టీ లెవల్ కార్ పార్కింగ్,ప్లానిటోరియంతో పాటు, అనేక ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం విఎంఆర్డిఎ రూపకల్పన చేసిన మాస్టర్ప్లాన్ భవిష్యత్ 20 సంవత్సరాలకు సరిపోయే విధంగా తయారు చేస్తున్నామన్నారు. ఇందులో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నట్లు చెప్పారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైజాగ్ జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, జిల్లాలో జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు కేటాయించే అవకాశాలను పరిశీలన చేయాలని కోరారు. గతంలో కూడా అప్పటి చైర్మన్లు సీనియర్ జర్నలిస్టులకు స్థలాలు నామమత్ర ధరకు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. 2005లో విఎజె సంఘం ప్రభుత్వానికి రూ.5.46 కోట్లు చెల్లించనప్పటికీ వేరువేరు కారణాలతో నేటికి 182 మంది జర్నలిస్టులు ఆయా స్థలాలను పొందలేకపోయారన్నారు. ఎన్నో వ్యయప్రయాసలు కోర్చి జర్నలిస్టులు ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించారని, కాబట్టి విఎంఆర్డిఎ పరిధి మేరకు తమ వంతు సాయం అందించాల్సిందిగా శ్రీనుబాబు కోరారు. గత చైర్మన్ల తరహాలోనే తాను కూడా తన వంతు జర్నలిస్టులకు పూర్తిస్దాయిలో సహకారం అందిస్తామన్నారు. విజెఎప్ కార్యదర్శి ఎస్. దుర్గారావు మాట్లాడుతూ, అందరి సహాకారంతోనే కార్యక్రమాలు విజయవంతం చేయగలగుతున్నామన్నారు. భవిష్యత్లో కూడా జర్పలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. విజెఎఫ్ ఉపాధ్యక్షులు ఆర్.నాగరాజు పట్నాయక్ స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు టి.నానాజీ, జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్,కోశాధికారి పిఎన్ మూర్తి, కార్యవర్గ సభ్యులు ఇరోతి ఈశ్వరరావు, ఎంఎస్ఆర్ ప్రసాద్, దొండా గిరిబాబు, వరలక్ష్మీ, , డేవిడ్ రాజు, గయాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ను విజెఎఫ్ కార్యవర్గం ఘనంగా సత్కరించింది.