వైఎస్సార్ హౌసింగ్ వేగవంతం చేయాలి..
Ens Balu
4
Visakhapatnam
2021-08-10 13:32:36
నవరత్నాలు –పేదలందరికి ఇళ్లు, జగనన్న గృహనిర్మాణాల గ్రౌండింగ్ పనులను ఈ నెల 15 లోగా వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో గృహ నిర్మాణ పనులపై వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహ నిర్మాణ పథకానికి సంబందించి పనులను అలసత్వం లేకుండా సంబందిత మండల అధికారులు అంకిత భావంతో పని చేసి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నవరత్నాలు – పేదలందరికి ఇళ్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, వై ఎస్ ఆర్ అర్భన్ ఫేజ్ - 1 గృహ నిర్మాణాలకు సంబందించి లే అవుట్ లు, గ్రౌండింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రతి మంగళవారం హౌసింగ్ పనులకు సంబందించిన పురోగతిపై సమీక్ష నిర్వహిస్తానని ఎప్పటి కప్పుడు జరుగుతున్న అభివృద్ది తనకు వివరించాలన్నారు. లే అవుట్ లలో బేస్ మెంట్ లెవెలింగ్, అంతర్గత రోడ్లు, అప్రోచ్ రోడ్లు, విద్యుత్తు, బోర్ వెల్స్, నీటి సరఫరా పనులను వేగవంతం చేయాలన్నారు. సిమెంట్, స్టీల్, ఇసుక మెటీరియల్ ను అందుబాటులో ఉంచాలన్నారు. హౌసింగ్ పిడి ఎం .శ్రీనివాస్ మాట్లాడుతూ నవరత్నాలు – పేదలందరికి ఇళ్లు మొదటి దశలో భాగంగా జిల్లాలో 36.932 గృహాలు లక్ష్యం కాగా, 33.202 గృహాలు గ్రౌండింగ్ అయి 90 శాతం తో రాష్ట్రంలో విశాఖ జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస మూర్తి, పంచాయితీ రాజ్, ఆర్ డబ్య్లు ఎస్, ఆర్ అండ్ బి , ట్రాన్స్ కో , డ్వామా, జి.వి.ఎం.సి, హౌసింగ్ శాఖల అధికారులు హాజరైయారు.