గోశాలను సందర్శించిన డిఆర్ డిఓ చైర్మన్..
Ens Balu
4
Tirumala
2021-08-22 15:56:05
తిరుమలలోని టీటీడీ గోశాలను డిఆర్ డిఓ చైర్మన్ సతీష్ రెడ్డి ఆదివారం ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి తో కలిసి సందర్శించారు. గోశాలకు ఇటీవల దానంగా వచ్చిన గిర్ ఆవులు, దూడలను ఆయన చూశారు. వాటి పోషణ, పాల దిగుబడి వివరాలను టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు శివకుమార్ వివరించారు. ఈవో మాట్లాడుతూ ఆగస్టు 30వ తేదీ నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి నవనీత సేవ ప్రవేశపెడుతున్నామని వివరించారు. దేశవాళీ ఆవుల నుంచి ఉత్పత్తి చేసిన పాలను పెరుగుగా మార్చి, దాని నుంచి వెన్న తీసి స్వామివారి నిత్య కైం కర్యాలకు ఉపయోగిస్తామన్నారు. వెన్నను గోశాల నుంచి శ్రీవారి సేవకులు ప్రదర్శనగా ఆలయం వద్దకు తీసుకుని వెళ్ళి అర్చకులకు అందిస్తారని ఈవో తెలిపారు. తిరుమలకు వచ్చే యాత్రికులు గోసేవ చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేయబోతున్నామని చెప్పారు. గోశాలలో నూతనంగా నిర్మిస్తున్న పొయ్యిలు, పాలు కాచి పెరుగు, దాని నుంచి వెన్న తీసే విధానాన్ని ఆయన తెలియజేశారు. శ్రీవారి కైంకర్యాలకు అవసరమయ్యే నూనె కూడా తయారు చేసేందుకు గానుగ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సివిఎస్వో గోపీనాథ్ జెట్టి, గోసంరక్షణ శాల అధికారి డాక్టర్ నాగరాజు, డిప్యూటి ఈవో లోకనాథం, విజివో బాలిరెడ్డి పాల్గొన్నారు.