ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి మొదలైపోయింది.. త్వరలో జరగనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి ప్రభావంతో 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను చూపించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో సీపీఎస్ ఉద్యోగులు ఉండటం.. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తామన్న ప్రభుత్వం దానిని రద్దు చేయకుండా జీపీఎస్ ను తెరమీదకు తీసుకు రావడం..దానిని వ్యతిరేకించిన ఉద్యోగ సంఘాలు సెప్టెంబరు 1 నిరసన దినంగా ప్రకటించి ఆందోళన చేపట్టడం ఈ కారణాలన్నీ ఎమ్మెల్సీ ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాలున్నాయి. ఇప్పటికే ఇదే విషయమై ఉద్యోగ సంఘాలు, వారి వారి సామాజిక మాధ్యమాల్లో తీవ్ర స్థాయిలో చర్చజరుగుతున్నట్టు సమాచారం అందుతోంది. బయటకు తెలియజేస్తే ప్రభుత్వం కేసులు పెట్టి, వేధింపులకు గురిచేస్తుందని ముందుగానే గుర్తించిన సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పట్టభద్ర నిరుద్యోగులు, ఇతర అధికారులు, ఉద్యోగులు కూడా 2024 కి ముందు వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే తమ ఓటు విలువను ఇప్పటి ఎన్నికల్లో తెలియజేసి దాని ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుందో ప్రభుత్వానికి తెలియజేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సంకేతాలు అందుతున్నాయి. అయితే దానికి ధీటుగా ప్రభుత్వం కూడా తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు,అభివ్రుద్ధిని చూపించి తాము సూంచిన అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా కూడా పనిచేస్తున్నది.
ప్రత్యక్ష ఎన్నికల్లో ఉద్యోగులదే పైచేయి..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పట్టభద్రులు, ఉపాధ్యాయులు నేరుగా పాల్గొనే అవకాశం ఉండటంతో ఇప్పటి నుంచే నిరుద్యోగ పట్టభద్రుల సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది ఉన్నారు, ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారనే సమాచారాన్ని సేకరిస్తున్నారు. దాని ప్రకారమే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత, ఓట్లు నమోదు చేసుకుని తమ ఓటు ప్రభావాన్ని పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి తెలియజేసి ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ఐకమత్యాన్ని తెలియాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ప్రభుత్వశాఖల వారీగా ఉద్యోగులంతా ఏకమై ఎమ్మెల్సీ ఎన్నికల్లో పైచేయి సాధించి తమ అభ్యర్ధిలను గెలిపించుకోవడానికి ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నట్టుగా చెబుతున్నారు. అదే జరిగితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబాల ఓటు బ్యాంకు మొత్తం అధికార పార్టీకి వ్యతిరేకంగా పడే అవకాశాలే స్పష్టంగా కనిపించనున్నాయి. దానికి తోడు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రివర్స్ పీఆర్సీ అమలు చేయడం వంటి అంశాలు కూడా ఉద్యోగులను చాలా తీవ్రంగా ఆలోచించేలా చేస్తున్నాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో పై చేయి సాధించడంతో ఉద్యోగుల వ్యతిరేకిస్తే పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఇటు ప్రజానికానీకి కూడా తెలియజేసే పనిలో పడ్డారు.
తీవ్ర నిరాశలో పట్టభద్ర నిరుద్యోగులు..
అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచి జాబ్ కేలండర్ ప్రతీ ఏటా ప్రకటిస్తామని చెప్పి..ఆపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అరకొర కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ తప్పా రెగ్యులర్ ఉద్యోగాలను భర్తీచేయకపోవడంతో నిరుద్యోగులంతా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయ శాఖలో లక్షా 21వేల ఉద్యోగాలు భర్తీచేసినప్పటికీ ఇంకా పోలీస్, ఉపాధ్యాయ, వైద్యఆరోగ్యశాఖలతోపాటు ప్రభుత్వంలో 70 ప్రభుత్వ శాఖల్లో వేలాది ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. అంతేకాకుండా 2024నాటికి దానికి రెట్టింపు సంఖ్యలో ఉద్యోగుల రిటైర్ మెంట్లు కూడా ఉండటం..దానిని పట్టించుకోకుండా ఖాళీల భర్తీ చేపట్టకపోవడంతో పట్టభద్ర నిరుద్యోగులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నట్టు కనిపిస్తున్నది.ఇటీవలే సీపీఎస్ ఉద్యోగులు తలపెట్టిన నిరసనకు వీరంతా మద్దతు ఇవ్వడమే దానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇటు పట్టభద్రుల్లో కూడా చాలా పార్టీల నుంచి అభ్యర్ధులు ఈసారి ఎన్నికల్లో నిలుచునే అవకాశం వుండటంతో తమ నిరసనను కూడా వ్యతిరేక ఓటు ద్వారానే చూపించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిరుద్యోగుల కోసం పనిచేసేవారిని, వారి గళాన్ని ప్రభుత్వం ముందు గట్టిగా వినిపించే అభ్యర్ధులనే ఎన్నుకొని తమ మద్దతు ఇస్తారని కూడా చెబుతున్నారు.
ఓటు బ్యాంకు సమీకరణలో రాజకీయపార్టీలు
ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నందున ఇటు పట్టభద్రులు, అటు ఉపాధ్యాయుల రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది ఉన్నారు..ఇప్పటి వరకూ ఎంత మంది ఓటును నమోదు చేసుకున్నారు..ఇంకా ఎంత మంది ఆయా నియోజకవర్గాల పరిధిలో ఓటు నమోదు చేసుకోవాల్సి వుంది..ఆయా కుటుంబాల్లో సీపీఎస్ ఉద్యోగులుగానీ, పెన్షనర్లు గానీ ఉన్నారా.. ఉంటే వారి ద్వారా కొత్తగా ఓట్లు నమోదు చేసి ప్రభుత్వ వ్యతిరేక అభ్యర్ధులకు ఓటు వేసి తమ బలాన్ని నిరూపించుకోవాలని కూడా ప్రత్యేకంగా సమీకరణలు చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. దానికోసం నిరుద్యోగ సంఘాలు, పట్టభద్రుల సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్ సంఘాలు ఇలా అన్ని వర్గాల వారిని ఇప్పటికే రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్సీ ఆశావాహులు ప్రసన్నం చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితిని వివరించి ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నారు. ఇప్పటికే చాలా రాజకీయపార్టీలు అభ్యర్ధులను ఖరారు చేసిన నేపథ్యంలో సీటు గ్యారంటీ అనుకుంటున్నవారంతా జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలల వారీగా జాబితాలు సేకరించే పనిలో పడ్డారు.
కీలక భూమిక వహించనున్న సచివాలయాలు..
ఏపీలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ సారి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కీలక భూమిక వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒకే నోటిఫికేషన్ ద్వారా 1.20లక్షల మందిని ప్రభుత్వం నియామకం చేసింది. అందునా ఇటీవలే వారి సర్వీసులను రెగ్యులర్ చేసింది. దీనితో సచివాలయాల్లో పనిచేసే పట్టభద్ర ఉద్యోగులంతా ప్రభుత్వానికి అనుకూలంగానే ఓటు వేస్తారని ప్రభుత్వం కూడా భావిస్తున్నది. అయితే వీరు కూడా సీపీఎస్ పరిధిలోకే రావడం, పీఆర్సీలో వీరికి కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో న్యాయం చేయకపోవడం, పీఆర్సీ ఎరియర్స్ ను ఇవ్వకపోవడం, వీరికి పీఆర్సీ ఇచ్చే సమయంలోనే హెచ్ఆర్ఏ, డీఏ స్లాబుల్లో కోత వేయడం, రెండేళ్లకు ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తామని చెప్పి రెండు సంవత్సరాల 9నెలల వరకూ చేయకపోవడం, ఈ 9నెలల సమయంలో సుమారు రెండు డీఏలో సచివాలయ ఉద్యోగులు కోల్పోవడం తదితర కారణాలతో చాలా వరకూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వుంటారనే ప్రచారం మరోవైపు సాగుతోంది.
ఇవే అంశాలతో అటు ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్జీఓ సంఘాలు కూడా సచివాలయ ఉద్యోగులను చైతన్యం చేయడంతో పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాగా తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, తొమ్మిది నెలలు ఆలస్యమైనా ఉద్యోగాలను రెగ్యులర్ చేశారనే ఒక్క కారణంతోనైనా సచివాలయ ఉద్యోగుల్లో అగ్రభాగం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుందని కూడా పరిశీలకు భావిస్తున్నారు. చూడాలి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు, సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎటువైపు తమ ఓటు వేస్తారో.. ఓటు ద్వారా మొత్తం రాష్ట్ర ప్రజానికానికీ, వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏవిధంగా ఉండాలనే విషయమై ఏ తరహా సందేశాన్ని ఇస్తారనేది..!