ఎమ్మెల్సీ బరిలో సీపీఎస్ ఉద్యమనేత పాలేల..


Ens Balu
55
Tadepalli
2022-09-04 01:32:40

సీపిఎస్ ఉద్యమ పితామహుడు..ఉద్యమే ఊపిరిగా జాతీయ స్థాయిలో పాత పెన్షన్ కోసం అలుపెరగకుండా పోరాటం చేస్తున్న యువనేత.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి.. పాలేల రామాంజనేయులు ఈ సారి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. సీపీఎస్ రద్దు అనే చిరకాల స్వప్నాన్ని ఇంటిపేరుగా మార్చుకొని ఉద్యమాన్ని పతాక స్థాయితో చేపడుతున్న ఈయనకు ఉపాధ్యాయ సంఘాల నుంచే కాకుండా ఇతర సీపీఎస్ ఉద్యోగ సంఘాల నుంచి కూడా అశేష మద్దతు విశేషంగా పోగవడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. సాధారణంగా ఉద్యమం చేపడితే సీపీఎస్ రద్దు కాదని..చట్టసభల్లో ఉద్యోగుల తరపున వాణి బలంగా వినిపించడం ద్వారా మాత్రమే సీపీఎస్ రద్దును సాధించాలనే ఏకైక లక్ష్యంతో ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి ప్రత్యక్షంగా దిగాలని కూడా అన్ని వర్గాల ఉపాధ్యాయుల నుంచి ఒత్తిడి కూడా అధికం అవుతున్నది. వెరసీ పాలేల ఎమ్మెల్సీగా అయితే సీపీఎస్ రద్దు ఏపీలో అమలవుతుందని ఉద్యోగులు భావిస్తున్నారు.

ఇదీ పాలేల సీపిఎస్ ఉద్యమ నేపథ్యం..
ఆంధ్రప్రదేశ్ లో సీపీఎస్ రద్దు కోసం రాష్ట్రస్థాయిలో ఉద్యమం చేపడితే తప్పా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావని భావించిన పాలేల రాష్ట్రంలో  ఆంధ్రప్రదేశ్ సీపీఎస్(APCPS) అసోసియేషన్ ను ఏర్పాటు చేయడమే కాకుండా.. జాతీయ స్థాయిలో నేషనల్ మూవ్ మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్(NMOPS)లో కూడా జాతీయ కార్యదర్శిగా కీలక బాధ్యతలు చేపట్టి ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో నడిపించారు. పైగా చత్తీస్ ఘడ్,  ఝార్ఖాండ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో సీపీఎస్ ను అక్కడి ప్రభుత్వాలు రద్దుచేయడంలో అత్యంత కీలకంగా కూడా వ్యవహరించారు. ఫలితంగా నేడు ఆ రాష్ట్రాల్లో సీపీఎస్ ఉద్యోగులంతా ఓపీఎస్ లోకి మారేలా చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ మరియు ఫ్యామిలీ పెన్షన్ సాధించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. అదే స్పూర్తితో సీపీఎస్ నే ఇంటిపేరుగా మార్చుకొని ఆంధ్రప్రదేశ్ లో వందలాది ఉద్యమాల్లో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లోనూ సీపీఎస్ రద్దు చేయించే దిశగా అడుగులు ముందుకి వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగులను ఏకతాటిపైకి తీసుకు రావడంలోనూ అత్యంత ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మద్దతు
రాయలసీమ జిల్లాల్లో పాలేల రామాంజనేయుల అనే  పేరు తెలియని ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఉండరంటే అతిశయోక్తికాదు. ఒక్క రాయలజీమ జిల్లాల్లోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, విభజన జిల్లాల్లోనూ సీపీఎస్ రాష్ట్ర ఉద్యమనేతగా కూడా ఈయన అశేషమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లు పరిష్కారం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చేసే ఉద్యమాల్లో అత్యంత చురుకుగా పాల్గొంటూ..సమస్యను ఇటు రాష్ట్ర ప్రభుత్వం,అటు కేంద్ర ప్రభుత్వం ద్రుష్టిలోకి తీసుకెళ్లడంలోనూ క్రియాశీలంగా వ్యవహరించిన ఈయనకి ఉద్యోగ సంఘాల మద్దతు విశేషంగా పెరుగుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఉద్యమనేత చట్టసభల్లో అడుగుపెట్టి అక్కడ తమ వాణిని బలంగా వినిపిస్తే..పరిష్కారం కాని ఎన్నో సమస్యలను నేరుగా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాడానికి వీలుపడుతుందని అంతా భావిస్తున్నారు. అంతేకాకుండా ఆ నినాదంతోనే పాలేలను ఎమ్మెల్సీ బరిలోకి దించి ఉద్యోగుల చిరకాల డిమాండ్ సీపీఎస్ రద్దును సాధించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తున్నది.

అధికార పార్టీ సభ్యులున్నా సీపీఎస్ రద్దే లక్ష్యం
వాస్తవానికి అధికార పార్టీ అభ్యర్ధులే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందడం అనాదిగా ఆనవాయితీగా వస్తున్నది. అయినప్పటికీ సీపీఎస్ రద్దుకై, ఉద్యోగుల ప్రధాన డిమాండ్ కై ఉద్యమాన్ని ఉప్పెనలా మార్చిన పాలేలను రంగంలోకి దింపడం ద్వారా ఉద్యోగుల ఐకమత్యాన్ని కూడా ప్రభుత్వానికి తెలియజేసేలా చేయాలనే నిర్ణయానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు వచ్చినట్టు చెబుతున్నారు. అధికారపార్టీ అభ్యర్ధులు ఎంతమంది రంగంలోకి దిగినా స్వచ్ఛందంగా, సీపీఎస్ రద్దుకై స్వతంత్ర్య అభ్యర్ధిగా అయినా ఎమ్మెల్సీ పోటీలో ఉంచితే  ఉద్యోగులు, ఉపాధ్యాయుల చిరకాల స్వప్నం సాకారం అవుతుందనేది ఉద్యోగులు, ఉపాధ్యాయుల భావన. దానికి అనుగుణంగా ఉద్యోగులందరి మద్దతుతోనే పాలేల ఎమ్మెల్సీ బరిలోకి దిగుతున్నారని ఆయన కంటే ముందుగా ఉద్యోగులు, సంఘాల ప్రతినిధులే తూర్పు రాయలసీమలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. చూడాలి సీపీఎస్ రద్దే ఊపిరిగా ఉద్యమం చేస్తున్న పాలేల రామాంజనేయులు ఎమ్మెల్సీగా దిగే విషయంలో ఏం జరుగుతుందనేది..!