ఎమ్మెల్సీ ఎన్నికలకు యువత సన్నద్ధం..


Ens Balu
21
Tadepalli
2022-09-22 07:44:13

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి యువత ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. పట్టభద్రులు ఉమ్మడి ఉత్తరాంధ్రాలో అత్యధిక శాతం ఉన్నప్పటికీ ఈ దఫా ఎన్నికల్లో మాత్రం పట్టభద్ర నిరుద్యోగులు, ఉద్యోగులు, గ్రుహిణిలు, యువత ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు. గతంలో మాదిరిగా రాజకీయ పార్టీలు చెప్పినట్టుగా ఓటు వేసే విధానంతో కాకుండా స్వచ్ఛందంగా అభ్యర్ధులను ఎంపిక చేసుకొని..వారు యువతకు ఏ విధంగా భవిష్యత్తులో ఉపయోగపడనున్నారో తెలుసుకున్న తరువాత మాత్రమే ఓటు పరిస్థితులు ఇపుడు నెలకొన్నాయి. దానికి అనుగుణంగానే నిరుద్యోగ పట్టభద్రులంతా ప్రాంతాల వారీ తమ బలం నిరూపించుకునేందుకు అపుడే ఓటర్ల జాబితాలను ఎవరికి వారు తాజాగా సిద్ధం చేసుకుంటున్నారు.

యువత తమ దగ్గరకు వచ్చే ఎమ్మెల్సీ అభ్యర్ధులకు తమకు ఏమి కావాలో..వచ్చిన అభ్యర్ధి ఏం చేస్తారో చెప్పిన తరువాతే వారి ఓటును వేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. గత ఎమ్మెల్సీ ఎన్నికలకు, త్వరలో జరగబోయే ఎన్నికలకు ఓట్ల సంఖ్యలో భారీగా వ్యత్యాసం వచ్చి ఓటర్లు పెరడగంతో అటు అభ్యర్ధులకు కూడా గట్టు పరిస్థితులే కనిపిస్తున్నాయి. దానితో ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్షాలతోపాటు, ఇండిపెండెంట్ అభ్యర్ధులు కూడా గట్టిగానే నెట్వర్క్ చేసుకోవాల్సి వస్తున్నది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటు నమోదు చేసుకోవడానికి కేవలం ఏడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇప్పటి నుంచే ఎవరి స్థాయిలో వారు తమ ఓటు బ్యాంకును పదిలం చేసుకునే పనిలో పడ్డారు. ఈసారి ఎన్ని రాజకీయాలు చేసినా, ఎలాంటి బెదిరింపులకు పాల్పడినా, పెద్ద మొత్తంలో తాయిలాలు సమర్పించినా ఓటు బ్యాంకును పెంచుకోవడం మాత్రం కష్టమనే చెబుతున్నారు విశ్లేషకులు. 

గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడి గెలిచి.. ఆతరువాత నిరుద్యోగ పట్టభద్రుల విషయంలో ఎలాంటి అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపట్టని విషయంలోనూ ఇపుడు పట్టభద్రులు సమాచాలోచనలు చేస్తున్నారు. గతంలో ఏపీపీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలోనూ, కొన్ని గ్రూపు-2 కేడర్ ఉద్యోగాలను, గ్రూప్-1 కలపడం, కొన్నింటిని కేడర్ లేకపోయినా గ్రూపు-2లో చేర్చడం, డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడంపై గతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఆ సమస్యలను పరిష్కరిస్తామని గతసారి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్సీలు హామీలు ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. దీనితో ఓట్లు వేయించుకొని, రాజకీయంగా ఎదిగి..నిరుద్యోగ పట్టభద్రులను గాలికొదిలేసిన విషయాన్ని కూడా కాస్త సీరియస్ గానే తీసుకున్న ఎమ్మెల్సీ ఓటర్లు ఈసారి ఆ సమస్యలను పరిష్కించేవారికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది.

చాలా కాలం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడం, దానిపై ఎమ్మెల్సీలు ప్రభుత్వం వద్ద ప్రస్తావన తేవకపోవడం, భవిష్యత్తు కార్యాచరణ,  ఇలా అన్ని కోణాల్లోనూ యువత ఆలోచనలు చేస్తూ వారికి అనుకూలంగా ఉన్న అభ్యర్ధులకే ఓటు వేయాలని భావిస్తున్నట్టుగా సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గత ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ఈసారి జరిగే ఎన్నికలపై భారీ ఎత్తున అంచనాలు పెరిగిపోతుండటం కూడా చర్చనీయాంశం అవుతుంది. చూడా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల ముఖ చిత్రం ఏవిధంగా ఉండబోతుందనేది..!