ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార, ప్రతిపక్షపార్టీలతోపాటు అభ్యర్ధులందరికీ కత్తిమీద సాములా మారాయి. ఒకప్పుడు ఎన్నికలంటే ఓటరుకి ఏమీ తెలిసేది కాదు. ఎన్నికల సమయంలో ఓటుకి నోటు, బీరు, బిర్యానీ ఇస్తే ఓటు పడిపోయేది. కానీ 2019 ఎన్నికలు తరువాత ప్రజలకు ఎన్నికలంటే ఏంటో..పోటీదారులు ఎంత ఖర్చు చేస్తారో..ఆ తరువాత పదవిలోకి వచ్చిన తరువాత ఎంతెంత రాబడతారో మొత్తం ఓటరు అవగాహన చేసుకున్నాడు. ఈ తరుణంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ఇపుడు అన్ని వర్గాల ఎమ్మెల్సీ అభ్యర్ధులు తలలు పట్టుకుంటున్నారు. గెలుపుపై ఎవరికీ స్పష్టత లేకుండా పోయింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది మొదలు అభ్యర్ధులు సమాలోచనలో పడ్డారు. ఓటర్లను విభజన చేస్తే తప్పా తమకు ఓట్లు పడవని భావించి ఆదిశగా అడుగులు వేస్తున్నారు. అయినప్పటికీ అభ్యర్ధులకు ఎక్కడో కొడుతూనే ఉన్నది. అలాగని అధికారపార్టీ అభ్యర్ధులుకూడా ఆందోళన పడుతున్నా వారికి ఒక వర్గం ఓట్లు పడతాయనే ధీమా మొదలైంది.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు వ్యతిరేకంగానే..
ఈసారి జరిగే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి పూర్తిగా పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకంగా ఓటు వేస్తారనే వాదన బలంగా వినిపిస్తుంది. అలాగని ప్రతిపక్షపార్టీలకు ఓట్లు పడతాయా అంటే ఆ విషయంపై కూడా క్లారిటీ రాలేదు. ఇపుడు స్వతంత్ర్య అభ్యర్ధులు.. బాగా చదువుకొని ప్రజాసేవలో ముందున్న అభ్యర్ధులకే కాస్త వాతావరణం అనుకూలంగా కనిపిస్తున్నది. పీర్సీ ఇచ్చిన సమయంలో ప్రభుత్వంహెచ్ ఆర్ఏ, డీఏలో భారీగా కోతలు విధించడంతో ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకతతో ఉన్నారు. కొంత మంది గ్రామ, వార్డు సచివాయ ఉద్యోగులు ప్రభుత్వానికి విదేయులుగా ఉన్నా ఎంత శాతం మేర ఓట్లు పడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు రిఫరెండం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సారి ఓటర్లు బలంగా నిశ్చయించుకున్నారనే ప్రచారం రాష్ట్రంలో గట్టిగా జరుగుతోంది. అయితే దానికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా తమ పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవడానికి సమీకరణలు కూడా గట్టిగానే చేస్తున్నది. కాగా వ్యతిరేక ఓటు బ్యాంకును మాత్రం వామపక్షాల అభ్యర్ధులు కేష్ చేసుకునే అవకాశాలే అధికంగా ఉన్నాయి.
సామాజిక వర్గం, యువ సంఘాలే కీలకమా..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి సామాజిక, యువ సంఘాలు కీలక పాత్ర పోషించే పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకలు నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఏఏ సామాజిక వర్గం నుంచి ఎవరు బరిలో దిగుతున్నారో ముందుగానే చర్చించుకొని ఆయా సామాజిక వర్గం ఓట్లు వారి అభ్యర్ధికే వేయాలనే సంకల్పంతో కార్యాచరణ చాపకింద నీరుగా సాగుతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. దానికోసం ఓటరు నమోదు కార్యక్రమం కూడా కాస్త గట్టిగానే చేపడుతున్నారు. గత ఎన్నికల ఓటరు జాబితా మొత్తం రద్దు చేయడంతో, కొత్తగా ఓటర్లు నమోదు కావాల్సి ఉన్నందున పెద్ద ఎత్తున సామాజిక వర్గాలు, యువ సంఘాలు ఈ పనిలోనే నిమగ్నమై ఉన్నాయి. మరికొందరు యువతను మచ్చిక చేసుకొని ఓట్లు ఆన్ లైన్లో కూడా నమోదు చేయిస్తున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికలతో పోలిస్తే..ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేదిశగా ఓటరు నమోదు కార్యక్రమాలు చేస్తున్నారు. అందులోనూ సామాజిక వర్గాల్లో ఆర్ధిక, అంగ బలాన్ని ఈ ఎన్నికల్లోనే ప్రదర్శించుకోవాలని అన్ని సామాజిక వర్గాలు పోటీ పడి మరీ పనిచేస్తున్ాయి.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఓట్లూ డౌటే..
అధికార పార్టీ అభ్యర్ధులకి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఓట్లు కొద్దిమేర పడవనే సంతకేతాలను సాంకేతిక అంశాలు రుజువు చేస్తున్నాయి. కారణం ఈ శాఖలోని ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యధిక శాతం మందికి ఇంటర్, డిప్లమా చేసినవారే. ఇక్కడ మూడేళ్ల డిప్లమాకి ఓటు ఉన్నప్పటికీ, రెండేళ్ల డిప్లమా(అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ) కి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు లేదు. అలాగని వీఆర్వోలాంటి ఉద్యోగులకు కూడా ఓట్లు లేవు. ఎందుకంటే ఆ పోస్టుకి చాలా మంది ఇంటర్మీడియట్ చదువుకున్నవారు దరఖాస్తు చేసుకున్నవారు అధికంగా ఉన్నారు. అంతేకాకుండా ఇటు గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా సర్వీసుప్రొభేషన్ డిక్లేర్ చేసిన సమయంలో వారికి పీఆర్సీతో పెంచిన జీతం ఇస్తున్నామని చెప్పిన ప్రభుత్వం వారికి రావాల్సిన ఎరియర్స్ మాత్రం ఇవ్వలేదు. పైగా ఉద్యోగులకు రెండేళ్ల తరువాత చేయాల్సిన సర్వీస్ ప్రొబేషన్ డిక్లరేషన్ 9నెలలు అదనంగా పొడిగించడంతో వారంతా పేస్కేలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ విషయంలో కూడా చాలామంది సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారు. అలాగని వీరి విషయంలో ప్రతిపక్షపార్టీలు కూడా ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో సదరు పార్టీల కోసం కూడా ఉద్యోగులు ఆలోచించడం లేదనేది స్పష్టంగా కనిపిస్తున్నది.
స్వతంత్ర అభ్యర్ధులు, వామపక్షాలకే ఎక్కువ మద్దతు..
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షపార్టీలకంటే స్వతంత్ర అభ్యర్ధులు, వామపక్షాలకే మద్దతు ఎక్కువగా వచ్చేటట్టు..ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. దానికి కారణం నిరుద్యోగ పట్టభద్రుల విషయంలో అధికారంలో వున్న ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఎలాంటి ప్రకటనలూ చేయకపోవడమే ప్రధానంగా కనిపిస్తున్నది. ఈసారి జరగబోయే ఎన్నికల్లో మాత్రం స్వతంత్ర అభ్యర్ధులు తమ సత్తాను ప్రదర్శించి, అధికార ప్రతిపక్షపార్టీలకు ధీటుగా నిలబడేలా ఉన్నారు. దానికోసం వారి సామాజిక వర్గాలు, యువత, ప్రత్యర్ధి అభ్యర్ధులంటే మండి పడే ప్రభుత్వ ఉద్యోగులను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఆ సమయంలో ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న ఉద్యోగులు, నిరుద్యోగుల నుంచి వారికి పూర్తిస్థాయిలో మద్దతు కనిపిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఆ వ్యతిరేక వర్గం ఓటు బ్యాంకు మొత్తం వామపక్ష అభ్యర్ధులపై వేపే చూస్తున్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. అయితే తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేశారనే ఒకే ఒక్క కారణంలో సచివాలయంలో పనిచేసే అగ్రభాగం పట్టభద్రులు మాత్రం అధికారపార్టీకే ఓట్లు వేసే అవకాశం వుంది. చూడాలి ఈసారి జరగబోయే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందనేది. ఎవరిని చట్టసభలకు పంపించనన్నది అనేది..!