విశాఖ పాలనా రాజధానిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని, ఆ నిర్ణయం కార్యరూపం దాల్చి వలసిన అవసరం ఎంతైనా ఉందని ఉమ్మడి విశాఖ జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. ఈనెల 15వ తేదీన విశాఖలో నిర్వహించనున్న విశాఖ గర్జన కార్యక్రమ సన్నాహక సమావేశం మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే అధికార వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారని, దీనికి ప్రతిపక్షపార్టీ అడుగడుగునా అడ్డు పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో ఏర్పాటుచేసిన శివరామకృష్ణన్ కమిషన్ రాష్ట్ర తర్వాత సర్వతోముఖాభివృద్ధికి అధికార వికేంద్రీకరణ అవసరమని పేర్కొన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం అమరావతినే రాజధానిగా నిర్ణయించిందని సుబ్బారెడ్డి అన్నారు. అమరావతి కొంతమందికి మాత్రమే ఉపయోగపడుతుందని, దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు అనువుగా మార్చుకున్నారని ఆయన అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి అమరావతి వాసులు ఎందుకు అడ్డుకుంటున్నారని సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అమరావతి ప్రాంత అభివృద్ధికి ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకోవడం లేదు కదా అని ఆయన అన్నారు. ఉత్తరాంధ్ర పౌరుడిగా ప్రతి ఒక్కరూ విశాఖ గర్జనకు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 15వ తేదీ ఉదయం 9 గంటలకు ఎల్ఐసి కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు హాజరుకావాలని, అక్కడి నుంచి పార్క్ హోటల్ వద్ద ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు పాదయాత్ర సాగుతుందని, మార్గమద్యంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆయా ప్రాంత ఇన్చార్జ్ చర్యలు తీసుకుంటారని సుబ్బారెడ్డి తెలియజేశారు.
మాజీ మంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షులు అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ పాదయాత్రగా వస్తున్న అమరావతి వాసులు ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. విశాఖను ఎందుకు రాజధాని చేయాలనే విషయాన్ని పాదయాత్ర చేస్తున్న వారికి తెలిసేలా విశాఖ గర్జన ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి ఎంపీ సత్యవతమ్మ, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, కన్నబాబురాజు, అదీప్ రాజ్, మేయర్ హరి వెంకట కుమారి, మాజీ మంత్రి బాలరాజు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, తిప్పల గురుమూర్తి రెడ్డి, ఎస్ఏ రెహమాన్, విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడారి ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.