అధికార వికేంద్రీకరణలో భాగంగా విశాఖ పరిపాలన రాజధానిగా చేయాలని ఉత్తరాంధ్ర ప్రజల బలమైన కోరిక విశాఖ గర్జన ద్వారా రాష్ట్రమంతా విడిపించాలని, ఈ గర్జన ప్రతిపక్షాల గుండెల్లో దడ పుట్టించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆర్కే బీచ్ లో విశాఖ గర్జనకు సంఘీభావంగా ఏర్పాటు చేసిన సైకత శిల్పాన్ని మంత్రి అమర్నాథ్ గురువారం సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖను పరిపాలన రాజధానిగా చేసి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి చేయాలన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుని అమలు చేయాలనుకుంటే ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డు పడుతున్నాయని అన్నారు.
ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వికేంద్రీకరణకు మద్దతుగా 15వ తేదీన నిర్వహిస్తున్న విశాఖ గర్జనను విఫలం చేయాలని, ప్రతిపక్షాలతో పాటు, మరికొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నా, తాము తగ్గేదే లేదని.. విశాఖ రాజధానిని సాధించి తీరుతామని అమర్నాథ్ స్పష్టం చేశారు. గర్జనలో కార్మికులు, కర్షకులు, యువకులూ, వృద్ధులు, మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను గుర్తించి అమరావతి రైతులు తమ పాదయాత్రను విరమించుకోవాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు.