ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా విశాఖ రాజధానిని సాధించి తీరుతామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను తెలియజెప్పేందుకు మన విశాఖ.. మన రాజధాని పేరుతో జేఏసీ ఏర్పాటు చేశారని చెప్పారు. విశాఖను రాజధానిగా చేసుకునేందుకు ఆదివారం నిర్వహించనున్న విశాఖ గర్జనకు అన్ని వర్గాల వారు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా ఉత్తరాంధ్ర ఇప్పటికీ పూర్తి వెనుకబాటుతనంతో ఉందని అన్నారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మన భవిష్యత్ తరాలు బాగుపడవని ఆయన అన్నారు. రేపు మొదలవుతున్న పోరాటం కేవలం ఉత్తరాంధ్రకే కాదు, ఆంధ్రరాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా అని అమర్నాథ్ అన్నారు.
కేంద్రీకరణ వల్ల జరిగిన నష్టం పునరావృతం కాకూడదని దీనివలన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆయన అన్నారు. దండయాత్ర చేస్తున్న రైతులకు తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని.. ఎందుకంటే, తాము పుట్టిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని, ఇప్పటివరకు ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్న వారిపై పోరాటం చేయడానికి ఉత్తరాంధ్ర ప్రజలను ప్రేరేపించింది అమరావతి రైతులేనని ఆయన అన్నారు. విశాఖ గర్జనకు వేలాదిగా తరలి వస్తున్న జనం అహింసా మార్గంలో వారి ఆకాంక్షలను పాదయాత్ర చేస్తున్న రైతులకు అర్థమయ్యేలా చెప్పాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రా ప్రాంత అభివృద్ధి కోసం జరుగుతున్న ఉద్యమాన్ని పత్రికల్లోనూ, మీడియాలోనూ రాకపోయినా పర్వాలేదు కానీ, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను హేళన చేస్తూ చూపించవద్దని మంత్రి అమర్నాథ్ చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు.

జేఏసీ చైర్మన్ లజపతిరాయ్ మాట్లాడుతూ విశాఖ రాజధానిగా ఏర్పడడానికి ఎవరు అడ్డు పెట్టొద్దని ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం నుండి బయటపడటానికి ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అనుకుంటున్న ఈ సమయంలో ఈ అవకాశాన్ని రాజకీయ కోణంలో చూడొద్దు అని ఆయన విజ్ఞప్తి చేశారు. 1956లో విశాఖపట్నాన్ని శాశ్వత రాజధానిగా చేయాలని నిర్ణయించినా, రాజకీయ పెద్దల మద్దతు లేకపోవడం వల్ల అది కలగానే మిగిలిపోయిందని అన్నారు. మరోసారి విశాఖ రాజధాని కావడానికి అవకాశం వచ్చిందని దీన్ని మిగిలిన ప్రాంతాల వారు కూడా సహకరించాలని లజపతిరాయ్ విజ్ఞప్తి చేశారు.
మాజీ మంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షులు అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజధాని కావడానికి విశాఖకు అన్ని హంగులు ఉన్నాయని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి దేవుడు జగన్మోహన్రెడ్డి రూపంలో వచ్చి విశాఖ రాజధానికి అవకాశం కల్పించాడని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఉత్తరాంధ్రకు కూడా మంజూరు చేసింది అంటే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని కేంద్రం గుర్తించినట్లే అయిందని అన్నారు. భౌగోళికంగా, సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా మూడు ప్రాంతాలు భిన్నంగా ఉన్నందువలన ఈ మూడింటినీ అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని అవంతి శ్రీనివాస్ అన్నారు.

ప్రభుత్వ విప్ ధర్మశ్రీ మాట్లాడుతూ విశాఖ గర్జన ఉద్యమాన్ని అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్న పార్టీలు రాజకీయ సమాధి అవుతాయని హెచ్చరించారు. వాతావరణం అనుకూలించినా, అనుకూలించకపోయినా విశాఖ గర్జన కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందన్నారు. జేఏసీ నాయకుడు కొయ్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ గర్జనను విజయవంతం చేసే బాధ్యత మీడియాపై ఉందని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉంటే, కొన్ని పత్రికలు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి విషయంలో ఉత్తరాంధ్ర ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని కనీసం విశాఖ విమానాశ్రయానికి విమానాలు వచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదని ఆయన అన్నారు.
రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే విశాఖకు విమానాల రాకపోకలు పెరిగాయని, నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్, బి హెచ్ పి వి, షిప్ యార్డ్ లను ఆదుకున్నారని అన్నారు. జగన్మోహన్రెడ్డి ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రయత్నం చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ మోకాలడ్డం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. విశాఖ గర్జన ఉత్తరాంధ్ర ప్రజల గుండెచప్పుడు అని అడ్డుకుంటే తాట తీస్తా మని ప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు ఎస్.శివశంకర్ మాట్లాడుతూ జేఏసీ ఉద్యమానికి రాష్ట్రవ్యాప్త స్పందన లభిస్తోందని అన్నారు. విశాఖను రాజధానిగా చేస్తే విశాఖనగరం ఒక్కటే అభివృద్ధి చెందదని, వీఎంఆర్డీఏ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. విశాఖ గర్జన కార్యక్రమానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేరుగ నాగార్జున, జోగి రమేష్ ,మాజీ మంత్రి కొడాలి నాని హాజరవుతున్నారని ఆయన తెలియజేశారు.
వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే మరొక ప్రాంతం వాళ్లు వ్యతిరేకించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమానికి ఆ ప్రాంత మీడియా ఏ విధంగా మద్దతు పలికిoదో, విశాఖ రాజధానికి ఈ ప్రాంత మీడియా కూడా అంతే బలంగా మద్దతు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మన్ దేవుడు మాస్టారు, విశాఖ ఎంపీ ఎం.వి.వి. సత్యనారాయణ, ఎమ్మెల్యే నాగిరెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ట్రేడ్ యూనియన్ నాయకుడు మంత్రి రాజశేఖర్, పార్టీ సీనియర్ నాయకులు రొంగలి జగన్నాధం తదితరులు పాల్గొన్నారు.