ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాడిన్నర సమయం ఉంది.. 2024లో జరిగే ఎన్నికల్లో జరిగే రాజకీయం అపుడే రాష్ట్రంలో మొదలైపోయింది. టిడిపి అధినేత ప్యాకేజీలతో రాజకీయం చేస్తున్నారనే ఆరోపణలు, విశాఖ గర్జన సందర్భంగా చోటుచేసుకున్న పరిణమాలు.. మంగళగిరి సభలో నేరుగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై జనసేనాని చెప్పుచూపించి మరీ రెచ్చిపోయిన వైనం.. ఇలా ఏ కోణంలో చూసినా ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారిపోయిందనే చెప్పాలి. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసే పోటీచేస్తామని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇపుడు టిడిపీ అధినేత చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ కావడం పట్ల తెరవెనుక రాజకీయం ఏం జరగబోతుందనే ప్రశ్నలకు ఊతమిచ్చింది. ఓ ప్రక్క అమరావతి రైతులు పాదయాత్ర చేస్తూ అధికారపార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్న తరుణంలోనే జనసేన, టీడీపీ కలిసి రాజకీయం మొదలు పెట్టడం వరుస భేటీలపై ఏ విధంగా స్పందించాలో కూడా తెలియని పరిస్థితి ఇటు విశ్లేషకులకు మదిలో సైతం నెలకొంది.
విశాఖ గర్జన రోజున పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ సక్సెస్ కావడం, ఆ కార్యక్రమానికి గంటల ముందు అధికారిపార్టీ, జేఏసి ఆధ్వర్యంలో చేపట్టిన గర్జన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవడంతొ ఎన్నికలవేడి వెంటనే రాజుకుంది. ఆ సమయంలోనే ఎవరికి ఎవరూ తగ్గకుండా పోటీ పోటీ ప్రకటనలు చేస్తూ ఎలక్షన్ హీట్ ను ఇప్పటి నుంచే రాష్ట్రంలో మొదలు పెట్టారనే సంకేతాలను పంపినట్టు అయ్యింది. పవన్ కళ్యాణ్ అండ్ కో టీమ్ ని అరెస్టు చేయడం ద్వారా ప్రజల్లో జనసేన కు మరింత బలం చేకూరిందని ఓ వర్గం చెబుతుంటే..అలా జరగడమే రాజకీయ వేడిలో నెయ్యిపోసినట్టు అవుతుందని మరో వర్గం ప్రచారం చేస్తున్నది. 2019 ఎన్నికల నుంచి కలిసి నడవకపోయినా పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ దెబ్బతో టిడిపీతో కలిసే పోటీచేస్తారనే సంకేతాలను ప్రజల్లోకి పంపారా అనికూడా చెబుతున్నారు. మిక్సిడ్ పొలిటిక్ వార్ మొదలు పెట్టాలంటే ఇదే సమయంగా జనసేన కూడా భవిస్తున్నట్టుగానే ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.
టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ సుదీర్ఘ సమయం బేటీ అయి పలు రాజకీయ పరమైన అంశాలు, విశాఖలో అరెస్టులు, త్వరలో చేపట్టబోయే కార్యాచరణ మొత్తం చర్చించారని చెబుతున్నారు. ఒక రకంగా మంగళగిరి సభలో పవన్ కళ్యాణ్ ఉద్దేశ పూర్వకంగానే చెప్పు చూపించి రాజకీయ వేడిరాజేశారని..దానికి చంద్రబాబే కారణమని కూడా ప్రచారం జరిగింది. అధికారపార్టీకి ఎంత సొంత మీడియా ఉన్నా పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు సోషల్ మీడియా అంతకు రెండింతలు ఉపయోపడుతున్న వేళ వీరిద్దరూ ఎలాంటి అడుగులు ముందుకు వేసినా అది ప్రజల్లో తీవ్ర సంచలనానికి కేంద్రబిందువు అవుతోంది. గతవారం రోజులు నుంచి జరుగుతున్న పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయనే విషయంలో పరిశీలకులు సైతం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. తాజా పరిస్థితిని గమనిస్తే..వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురూ కలిసి పోటీచేసి(మిక్సడ్ పాలిటిక్స్ ప్లేచేసి) అధికార వైఎస్సార్సీపీకి గట్టిపోటీ ఇవ్వడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. చూడాలి ఈ పొలిటికల్ హీట్ ఎలాంటి ప్రభావం రానున్నరోజుల్లో ఏపీరాజకీయాల్లో చూపిస్తుందనేది..!