ప్రజాసేవతోనే ఉన్నత స్థాయి గుర్తింపు


Ens Balu
25
Visakhapatnam
2022-11-26 08:10:22

ప్రజాసేవయే పరమావధిగా భావించి ముందుకు సాగిన  వ్యక్తులు ఎవరైనప్పటికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నుంచి తగిన గుర్తింపు లభించడం ఖాయమని ఎమ్మెల్సీలు పీవీఎన్ మాధవ్, వంశీకృష్ణ శ్రీనివాస్, ఎయూ రిజిస్ర్టార్ ఆచార్య వి.కృష్ణమోహన్ లు అన్నారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా , సీనియర్ పాత్రికేయుడిగా విశేష సేవలందిస్తున్న వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబును తాజాగా అంతర్జాతీయ విశాఖ విమానాశ్రయం సలహామండలి సభ్యుడిగా కేంద్రము నియమించిన నేపధ్యంలో శనివారం ఇక్కడ పెదవాల్తేరులో ఉత్తరాంధ్ర విద్యార్ధి సేన అత్యంత ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తొలుత రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణమోహన్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి జర్నలిజం వృత్తిలో రెండు దశాబ్ధాలకు పైగా సేవలందిస్తూ అంచలంచెలుగా ఎదిగిన గంట్ల శ్రీనుబాబుకి ఈ పదవి దక్కడం అభినందనీయమని కొనియాడారు.  ఉన్నత విద్యాభ్యాసం సాగించి సైకాలజీలో గోల్డ్ మెడల్ పొందిన శ్రీనుబాబు నేటి విద్యార్ధులకు కూడా ఆదర్శప్రాయుడన్నారు.  మెట్రోపాలిటన్ సిటీలో  మరింత మెరుగ్గా విమానాశ్రయ సేవలు ప్రజలకు అందే విధంగా తన వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ పార్టీల రహితంగా ఈ ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్న శ్రీనుబాబు భవిష్యత్తులో మరింతగా సేవలందించాలని కోరారు. జర్నలిజం వృత్తిలో ఉంటూ , అనేక సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనే శ్రీనుబాబుకి మరిన్ని ఉన్నత పదవులు వస్తాయని మాధవ్ ఆకాంక్షించారు. నిరంతరము పాత్రికేయులకు అండగా ఉంటూ వారి మన్ననలు పొందడం అభి నందనీయమన్నారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలో అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ జర్నలిస్టులకు నాయకత్వం వహిస్తున్న గంట్ల శ్రీనుబాబుకి ఈ పదవి దక్కడం హర్షణీయమని ఇప్పటికే సింహాద్రినాధుడు భక్తులకు మెరుగైన సేవలందించే విధంగా ఆయన కృషి చేస్తున్నారన్నారు. రానున్న కాలంలో విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు తోడ్పడాలని సూచించారు.
ఈ కార్యక్రమం నిర్వాహకులు ఉత్తరాంధ్ర విద్యార్థి సేన అధ్యక్షులు డాక్టర్ సుంకరి రమణమూర్తి మాట్లాడుతూ ఎవరికి ఏ కష్టం వచ్చినా నిరంతరం అందుబాటులో ఉండే శ్రీనుబాబుకు మరిన్ని ఉన్నత అవకాశాలు రావాలని తామంతా కోరుకుంటున్నామన్నారు.  ఉత్తరాంధ్రకు చెందిన ఆయన ఆ ప్రాంత అభివృద్ధికి నిరంతరం శ్రీనుబాబు అందిస్తున్న సేవలు ఎంతో మంది యువ నాయకులకు ఆదర్శప్రాయమన్నారు. సామాన్య ప్రజానీకానికి కూడా అండదండ లుగా నిలుస్తున్న శ్రీనుబాబు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని, అటువంటి వ్యక్తికి మరిన్ని మంచి అవకాశాలు ఇస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.ఉత్తరాంధ్ర యువతకు ప్రభుత్వాలు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాగాయకుడు మజ్జి దేవిశ్రీ,  సీనియర్ పాత్రికేయులు సుంకరి సూర్యం, విజయకుమార్, స్టూడెంట్ యునైటెడ్ నెట్వర్క్ అధ్యక్షులు ఆర్ బసవ కృష్ణమూర్తి, దళిత మేధావుల వేదిక అధ్యక్షులు సుందర్ సింగ్, ఏపీ స్టడీ సర్కిల్ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు కే ఆనంద్ కుమార్, పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రౌతు గోపి, ఉత్తరాంధ్ర విద్యార్థి సేన క్యాంపస్ ఇంచార్జ్ సుబుద్ధి శ్రీరామ్, విద్యార్థి నాయకులు చైతన్య వేణుగోపాల్ సన్యాసినాయుడు ప్రసాద్ లతో పాటు ఏయూకు చెందిన పలువురు పరిశోధక విద్యార్ధులు పాల్గొన్నారు.