ఆలయాలపై దాడులు దురదృష్టకరం..
Ens Balu
4
Tirumala
2021-02-26 14:22:43
తిరుమల శ్రీవారిని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయం వద్ద శ్రీ స్వామివారికి అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి కలిసి తీర్థప్రసాదాలు చిన్నజీయర్ స్వామికి అందజేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల చిన్నజీయర్ స్వామి మీడియాతో మాట్లాడుతూ కరోనా మహమ్మారిని ప్రపంచానికి దూరం చేసే శక్తి కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారికి మాత్రమే ఉందన్నారు. ఈ వ్యాధిని తట్టుకోగలిగే శక్తిని ప్రజలకు ఇవ్వాలని, దీన్ని రూపుమాపే శక్తి వైద్యులకు ఇవ్వాలని స్వామివారిని ప్రార్థించినట్టు తెలిపారు. ఆలయాలు మన ధర్మానికి మూలకేంద్రాలని, అనేక వైదిక కళలు, లౌకిక కళలు వీటి ఆధారంగా మనుగడ సాగిస్తున్నాయని వివరించారు. ఆలయాల ద్వారా వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా పోషణ లభిస్తోందన్నారు. ఇంతటి విశిష్టమైన ఆలయాల్లోని విగ్రహాలపై ఇటీవల దుండగులు దాడులు చేయడం దురదృష్టకరమన్నారు. రామతీర్థంలోని ఆలయానికి జరిగిన నష్టంపై ఇటీవల పరిశీలించానని చెప్పారు. అక్కడ ఇతర వసతులతో ఆలయాన్ని అభివృద్ధి చేయాలని టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డిని కోరామన్నారు. ఆలయాలు బాగుంటే ప్రజల్లో నైతిక ప్రవృత్తి బాగుంటుందని, ధర్మబద్ధంగా ఉంటారని వివరించారు.