విశాఖ నగరాభివ్రుద్ధికి సహకరించండి..


Ens Balu
2
Visakhapatnam
2021-03-19 19:09:16

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. శుక్రవారం, జివిఎంసి సమావేశ మందిరంలో తొలిసారిగా ఆమె మీడియాతో మాట్లాడారు.  ఒక గృహిణిగా ఉండి నేడు మేయర్ లాంటి ఉన్నత పదవి స్థాయికి ఎదగడానికి తోడ్పాటు అందించిన వారందరికి ఆమె కృతజ్ఞతలు తెలియచేసారు. సుమారు 6 ఏళ్ల తరువాత కొలువుదీరిన పాలక వర్గం ద్వారా నగరాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్ది, సమస్యలు పరిష్కరించడంలో మీడియా సహకారం కావాలన్నారు. ప్రధాన సమస్యలను,సూచనలు మీడియా తెలియజేయడం ద్వారా ప్రభుత్వం తో మాట్లాడి వాటిని పరిష్కరించేందుకు తనవంతు క్రుషి చేస్తానన్నారు. నగరంలో వార్డు సచివాలయాల ద్వారా ప్రజలు సత్వరమే సేవలు అందించేందుకు కమిషనర్ తో కలిసి పనిచేస్తామన్నారు. ఏ ప్రాంతంలో సమస్యలు ఉన్నా నేరుగా తన ద్రుష్టికి తీసుకు రావొచ్చునన్నారు.  తనకి ఈ పదవి రావడనికి కారణమైన  ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కి జీవితాంతం ఋణపడి ఉంటానని, రాష్ట్ర పర్యాటక శాఖామాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు వి. విజయసాయి రెడ్డి, ఎం.వి.వి.సత్యనారాయణ, సత్యవతి మరియు శాసన మండలి సభ్యులు, ఇతర వార్డు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. మరీ ముఖ్యంగా, ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, నగర అభివృద్ధికి కమిషనర్,  ఇతర ఉన్నతాధికారుల సహాయ సహాకారాలతో కృషి చేస్తానని తెలిపారు.