ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ప్రత్యక్షంగా జరిగే ఎమ్మెల్సీ(శాసన మండలి) ఎన్నికల్లో అసలైన రాజకీయం చోటు చేసుకోబోతుంది. ఎన్నికల సిత్రాలను రక రకాలుగా చూపిస్తుందనే వేడిని రగిలిస్తోంది. అవును మీరు చదువుతున్నది నిజమే. 2019లో 175 స్థానాలు కైవసం చేసుకోవడంతో శాసన మండలికి ఎన్నిక లేకుండా వైఎస్సార్సీపీ పార్టీ సభ్యులను నేరుగా పంపే అవకాశం ప్రభుత్వానికి దక్కింది. కానీ టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రత్యక్షంగా జరగాల్సి వుంటుంది. దీనితో అసలైన రాజకీయం మొత్తం అంతా ఇక్కడే జరగనుంది. దానికోసం అధికారపార్టీ వైఎస్సార్సీపీతోపాటు టీడీపీ, బీజేపీ ఇతర పార్టీలు స్వతంత్ర అభ్యర్ధులు కూడా ఈ సారిగట్టి పోటీ ఇచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల ఓటు బ్యాంకుతో నామినేటెడ్ పోస్టులు ఇచ్చినట్టుగా కొందరు ఎమ్మెల్సీలను శాసన మండలికి పంపిన ప్రభుత్వం.. ప్రత్యక్ష ఎన్నికలో మాత్రం గట్టి పోటీని ఎదర్కొనే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. అయినా అధికార పార్టీ దమ్ము ప్రదర్శించడానికి సిద్ధపడుతోంది. తమ అభ్యర్ధులను గెలిపించినా ఆశ్చర్యపోవాల్సి పనిలేదు. దానికి కారణం, అవకాశం కూడా ప్రభుత్వం దగ్గర పెద్ద అస్త్రం సిద్దంగా ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే అధికార పార్టీ అధికారంలోకి రాకముందు చేసిన హామీలు(ముఖ్యంగా సీపీఎస్, పీఆర్సీలు) ఆతరువాత యూ టర్న్ తీసుకోవడం, తేడాగా అమలు చేయడం, చాలావాటిని కుదించడం, కోత విధించడం.. కొన్ని హామీలకు రివర్స్ లో అమలు చేయడం వంటి అంశాలు కూడా అధికార పార్టీని ఇరుకున పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు.
అధికార పార్టీకే అత్యధిక ఓటు బ్యాంకు..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికార పార్టీ ఎక్కడా ఓట్ల కోసం వెతుక్కునే పరిస్థితి ఉండదు. ప్రభుత్వం 2019 లో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా నేటి వరకూ 1.21లక్షల మంది ఉద్యోగాలు పొంది సర్వీసు రెగ్యులైజేషన్ కూడా పొందారు. అందులో 60శాతానికి పైగా ఉద్యోగులు డిగ్రీ, పీజీ చదువుకున్నవారే ఉన్నారు. ఈ తరుణంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అత్యధిక ఓటు బ్యాంకు ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల నుంచి, పార్టీలోని కేడర్ నుంచి, వారి కింద పనిచేసే కార్యకర్తల నుంచి గ్రాడ్యుయేట్ ఓట్లు తెచ్చుకోవాలని చూస్తున్నది అధికార ప్రభుత్వం. ఇదే సమయంలో కొన్ని ప్రభుత్వ శాఖల్లోని గ్రాడ్యుయేట్లు, పార్టీ కేడర్ లోని వారు మాత్రమే సొంతపార్టీ అభ్యర్ధులకు ఓట్లు వేస్తారు తప్పితే మిగిలిన వారంతా అధికారపార్టీకి ఓటువేసే పరిస్థితి ఉండదని ప్రత్యర్ధి రాజకీయ పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి. దానికి తగ్గట్టుగానే వివిధ రాజకీయ పార్టీల నుంచి తమ తమ అభ్యర్ధులను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటున్నాయి. మరో వైపు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ప్రభుత్వం తరపు నుంచి అభ్యర్ధులను రెడీ చేయడానికి కార్యాచరణ పూర్తయింది. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఈ రెండు స్థానాల్లోనూ అధికార పార్టీ అభ్యర్ధులను నిలబెట్టడానికి సిద్దం చేసి ఉంచింది. అటు ఓటు బ్యాంకును కూడా అనుకూల మీడియా ద్వారా చైతన్యం చేసే కార్యక్రమం పరోక్షంగా చేపడుతున్నది.
ప్రతిపక్షాలకు ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపే కొలమానం
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్ష రాజకీయా పార్టీల అభ్యర్ధుల చేసే నెట్వర్క్, ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలను ఇటు గ్రాడ్యుయేట్లు, అటు టీచర్ల ద్రుష్టికి తీసుకెళితే ఫలితం ఉండవచ్చునని భావిస్తున్నాయి. దానికి అనుగుణంగానే కాస్త మాటకారులను, అధికారపార్టీ ప్రజా, నిరుద్యోగ వ్యతిరేక విధానాలను ఎండగట్టే వాయిస్ ఉన్న అభ్యర్ధులను తయారు చేస్తున్నది. ఇప్పటి వరకూ చాలా మంది ఆశావాహులు వివిధ పార్టీల నుంచి గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో నిలబడాలని సిద్దపడుతూ వారి వారి పార్టీలకు తమ అభ్యర్ధిత్వాలను పరిశీలించాల్సిందిగా దరఖాస్తులు కూడా చేసుకున్నారు. అయితే అందరి కంటే ముందుగా అధికార పార్టీ అభ్యర్ధులను సిద్దం చేసి ఉంచడంతో..వారిని ఎదుర్కొనే మెరికల్లాంటి అభ్యర్ధులను వారికి పోటీగా దించాలని కూడా ప్రతిపక్ష పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన వారు..ప్రజల సమస్యలపై గట్టిగా మాట్లాడేవారు, తెలివైన ప్రజా ప్రతినిధులను పెద్దల సభకు పంపడానికి వడపోత కార్యక్రమాలతో ఇతర పార్టీలు సిద్ధం చేసుకుంటన్నాయి. అంతేకాదు వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికలకు త్వరలో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలనే కొలమానంగా చేసుకోవాలని కూడా నిర్ధరించుకున్నాయి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయపార్టీలన్నీ.
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ ఆశల పల్లకి..
రాబోయే గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటు రాష్ట్రప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా గ్రాడ్యుయేట్ యువతను, ఉపాధ్యాయులను ఆశల పల్లకి ఎక్కించేందుకు సిద్దమైంది. సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి సుమారు రెండువేల ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీచేసేందుకు నోటిఫికేషన్ వచ్చేలా రంగం సిద్ధం చేస్తుంది. ఇలా చేయడం ద్వారా నిరుద్యోగ గ్రాడ్యుయేట్ ఓట్లన్నీ అధికారపార్టీ అభ్యర్ధులకు పడటానికి నూటికి నూరు శాతం ఛాన్సు ఉంది. అందులోనూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్ చేసి, వారికీ కొత్త పీఆర్సీ పేస్కేలు ఇచ్చిన ప్రభుత్వ తీరు కూడా నిరుద్యోగ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లను ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. అయితే ఒక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి తప్పా..మళ్లీ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి మాత్రం ప్రభుత్వం కూడా కాస్త గట్టిగానే పోరాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రవ్యాప్తంగా వున్న నాలుగు లక్షల పైచిలుకు ఉపాధ్యాయుల్లో 70శాతం మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. మిగిలిన 30శాతంలో కూడా పూర్తిస్థాయి మెజార్టీ వస్తుందో రాదో తెలియని పరిస్థితి. అలాగని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలను ప్రభావితం చేయడానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి అస్త్రం కూడా లేదు. అందులోనూ పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియకు ఉపాధ్యాయులు వ్యతిరేకంగా ఉండటంతో వారి సత్తా ఏమిటో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపడానికి అందరూ సిద్దంగా ఉన్నారు. ఇక గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వారి కుటుంబాలు, వైఎస్సార్సీపీ కేడర్ కుటుంబాలు మాత్రమే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు వేసే పరిస్థితి ఉంది తప్పితే జాబ్ కేలండర్ తీసినా.. సుమారు 60శాతం మంది నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.
ప్రధాన పోటీ మూడు పార్టీల మధ్యనే..
టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ప్రధాన పోటీ వైఎస్సార్సీపీ, బీజేపీ, టీడీపీ పార్టీల మధ్యనే ఉండబోతుంది. మిగిలిన రాజకీయ పార్టీలు ఉన్నా తమ అభ్యర్ధుల కోసం ఉమ్మడిగా పనిచేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి తప్పితే సింగిల్ గా రంగంలోకి దిగే సాహసం చేయలేవనేది అన్ని వర్గాల నుంచి వస్తున్నమాట. దీనితో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ప్రత్యక్ష ఎమ్మెల్సీ ఎన్నికలు 2024 శాసన సభ ఎన్నికలకు రిఫరెండంగా మారే జరుగుతాయని చెబుతున్నారు. అదే రాజకీయ పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే అధికారపార్టీ తమ అభ్యర్ధులంటూ కొంత మంది పేర్లను తెరపైకి తెచ్చినా.. ఇంకా అధికారికంగా ఇతర పార్టీలు తమ అభ్యర్ధుల పేర్లు ఇంకా ప్రకటించలేదు. ఎన్నికల్లో గెలిచే అభ్యర్ధులు, నిరుద్యోగులు, సంఘాలతో మంచి అనుబంధాలు ఉన్న యువతను ప్రోత్సహించి అధికారపార్టీని ఎదుర్కొనే గట్టి గ్రాడ్యుయేట్ల కోసం ఇతర పార్టీలు వలవేసి వెతుకుతున్నాయి. కొంత మంది ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు దరఖాస్తులు పెట్టుకున్నా..ఇంకా గట్టి అభ్యర్ధులు దొరుకుతారనే కోణంలోనే చూస్తున్నాయని సమాచారం. ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం విద్యాధికులు, మాజీ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసి రిటైర్ అయిన అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నందున అన్ని పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికలను రెఫరెండంగా తీసుకున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. యువత ఉద్యోగాల కోసం ఒక్క ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ కూడా తీయకుండా..కేవలంల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారానే ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభావం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోప్రభావం చూపిస్తుందనే వాదన కూడా బలంగానే వినిపిస్తుంది. చూడాలి ప్రధాన రాజకీయ పార్టీల మధ్య జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఏ స్థాయిలో రాజకీయం చేస్తుందనేది..!