ఎస్వీబీసీ హిందీ ఛానల్ ద్వారా శ్రీవేంకటేశ్వర స్వామి వైభవాన్ని దేశమంతటా ప్రచారం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమల, ఇతర అనుబంధ ఆలయాల్లో నిర్వహిస్తున్న వివిధ సేవలు, కైంకర్యాలు, పండుగలు, ధార్మిక కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి భక్తుని చెంతకు తీసుకెళ్లాలన్న ప్రధాన ఉద్దేశంతో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రారంభమైందన్నారు. ఎస్వీబీసీ తెలుగు, తమిళం, కన్నడ ఛానళ్లు ఇప్పటికే విశేష ప్రజాదరణ పొందాయన్నారు. ఎస్వీబీసీ హిందీ ఛానల్ కు కూడా ప్రాచుర్యం కల్పించేందుకు హిందీ మాట్లాడే ప్రాంతాలలో జియో వంటి వేదిక అవసరమన్నారు. జియో ఫైబర్ నెట్ ప్లాట్ఫారమ్లో ఎస్వీబీసీ హిందీ ఛానల్ ను ప్రసారం చేయడం, ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోకు మరింత ప్రాచుర్యం కల్పించడంపై జియో అధికారులతో చర్చించాలని ఎస్వీబీసీ సిఈఓను షణ్ముఖ్కుమార్, ఆదేశించారు. జియో వైస్ ప్రెసిడెంట్(ముంబై), ఐటి జిఎం సందీప్ తదితరులు పాల్గొన్నారు.