ఈరోజు-ఈఎన్ఎస్ కథనాలకు కూటమి ప్రభుత్వ స్పందన.. సచివాలయ మహిళా పోలీసులకు ప్రభుత్వశాఖ..?!


Ens Balu
88
visakhapatnam
2025-04-09 20:43:18

ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ.. ఏ ప్రభుత్వశాఖ లేని ఉద్యోగులుగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల కష్టాలకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టే ప్రయత్నాలు ప్రారంభించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నుంచి కోర్టు కేసులతో ఎలాంటి ప్రభుత్వశాఖ లేని ఉద్యోగులుగా ఇప్పటి వరకూ గాల్లో ఉన్న గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల కష్టాలు, భాదలపై ఈరోజు-ఈఎన్ఎస్ వరుస కథనాలు ప్రచురించింది.. దీనితో స్పందించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించింది.. అయినా ఫలితం లేకపోవడంతో రంగంలోకి దిగిన ఈరోజు-ఈఎన్ఎస్.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బాధలు, గత ప్రభుత్వం చేసిన మోసం, తలా తోకాలేని నియమాకాలు, ప్రభుత్వశాఖ లేకుండా మహిళలతో ప్రభుత్వ ఉద్యోగం చేయిస్తున్న మహిళా పోలీసుల వెతలపై గ్రౌండ్ లెవల్ రిపోర్టింగ్ తో వరుస కథనాలు ప్రచురించింది. దీనితో కూటమి ప్రభుత్వంలో కదిలిక వచ్చింది..త్వరలోనే క్యాబినెట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో విశాఖలో ఈ విషయాన్ని మళ్లీ ఈరోజు-ఈఎన్ఎస్ హోం మంత్రి అనివద్ద ప్రస్తావించగా మహిళా పోలీసుల కష్టాలు 10-15రోజుల్లో తీర్చడానికి ప్రభుత్వం ఒక సముచిత నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు..!

భారత దేశంలోనే ప్రభుత్వ శాఖ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు కష్టాలకు ఇక తెరపడే గడియలు దగ్గరకి వచ్చాయి. ఉద్యోగుల బాధలు, సర్వీసు నిబందనలు, ప్రమోషన్ ఛానల్ లేకుండా, ఎలాంటి పదోన్నతులకు అవకాశం లేకుండా ఇప్పటి వరకూ గాల్లోనే ఉండిపోయిన మహిళా పోలీసుల కష్టాలు కూటమి ప్రభుత్వంలో తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సచివాలయశాఖ ఏర్పాటు చేసి, తలా తోకా లేకుండా నియామకాలు చేసిందని.. కోర్టు కేసుల నెపంతో ఉద్యోగులను గాల్లో పెట్టిందని హోం మంత్రి వంగల పూడి అనిత మండి పడ్డారు. ప్రతిపక్షంలో ఉన్న దగ్గర నుంచి పోరాటం చేస్తున్న మంత్రి అధికారంలోకి రావడం అదే పోలీసుశాఖకు మంత్రిగా ఉండటంతో కాస్త గట్టిగానే ఈ విషయాన్ని పట్టుకున్నారు. అంతేకాకుండా అసెంబ్లీ, శాసన మండలి వరకూ తీసుకెళ్లి వారికి న్యాయం చేస్తామని, వారి చదువులు, ఆశక్తిల మేరకు వారికి సముచిత స్థానం కల్పించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పుకొస్తున్న ఆమె..ఇదే విషయాన్ని నేడు ప్రభుత్వం ముందుకి తీసుకెళ్లారు. అంతేకాదు అదే విషయాన్ని విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఈరోజు-ఈఎన్ఎస్ ప్రధాన ప్రతినిధి వేసిన ప్రశ్నకు బదులుగా.. మహిళా పోలీసులకు 10-15 రోజుల్లో వారు కోరుకునే విధంగా వారిని సముచిత స్థానాల్లో కూర్చో బెడతామని, ప్రభుత్వశాఖ కేటాయింపులు చేస్తామని ప్రకటించారు.

 ప్రస్తుతం సచివాలయశాఖలో 26 జిల్లాల్లోని సుమారు 15వేల మంది మహిళా పోలీసులు పనిచేస్తున్నారని.. అందులో చాలా మందికి పోలీసుశాఖలో పనిచేయడం ఇష్టంలేదని, మరికొందరు ఇష్టం చూపుతున్నారని చెప్పారు. ఎవరికి ఏ శాఖ ఇష్టమో తెలుసుకొని, వారి చదువులు, ప్రస్తుతం వారు ఏ పోస్టుకి అర్హులో విచారణ చేసి వారికి తగ్గ స్థానాల్లో కూర్చో బెడతామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం కొత్త ప్రభుత్వశాఖ ఏర్పాటు చేసింది తప్పితే దానిని ఒక పద్దతి ప్రకారం చేయలేదని, దాని ఫలితంగానే మహిళా పోలీసులంతా నేడు ప్రభుత్వశాఖ లేని ప్రభుత్వ ఉద్యోగులుగా ఏ శాఖకూ చెందని ఉద్యోగులుగా పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా వీరికా ప్రభుత్వశాఖతోపాటు, ప్రమోషన్లకు ఒక ప్రత్యేక వ్యవస్థ, ప్రభుత్వశాఖ కేటాయింపులు చేసి ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగానే వీరికి న్యాయం చేస్తామని చెప్పుకొచ్చారు.  సచివాలయ మహిళా పోలీసుల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే వీరు ఏ శాఖకు చెందని ఉద్యోగులుగానే ఉండిపోవాల్సి వస్తుందన్నారు. అది కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరన్నారు. అలాకాకుండా ప్రభుత్వ అవసరాలు, ప్రభుత్వశాఖలు, వారి అర్హతలు, వారికి నచ్చిన శాఖలను గుర్తించి వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

-ఈరోజు-ఈఎన్ఎస్ మాత్రమే సచివాలయ శాఖపై పోరాటం
ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వంలో 74 ప్రభుత్వశాఖలు ఉన్నా 75వ ప్రభుత్వ శాఖగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖను ఏర్పాటు చేసింది. అయితే కొత్త ప్రభుత్వశాఖ ఏర్పాటు చేస్తే అన్నిస్థాయిల్లో ఉద్యోగాలొస్తాయని అంతా భావించారు. అలాగే ఒక్క ఇదే సచివాలయ శాఖలో సుమారు 1.28 లక్షల ఉద్యోగాలను గత ప్రభుత్వం భర్తీ చేసింది. అయితే ఏ ఒక్క ఉద్యోగికి కూడా న్యాయం చేయలేదు. వారి జీవితాలను గాల్లోనే పెట్టేవిధంగా ఉంచేసింది. అందులో నిత్యం ప్రజల్లోనే ఉండే మహిళా పోలీసులని. వీరితో పాటు సంక్షేమ పథకాలు ఇచ్చే సంక్షేమ కార్యదర్శిలని. వీరి నియామకాల దగ్గర నుంచి అన్నీ అతుకుబొతుకులే. దానితో వీరి నియామకాలు చెల్లవంటూ ఉమ్మడి విశాఖ జిల్లాలో కొందరు కోర్టుని ఆశ్రయించారు. మహిళా పోలీసులను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా కాకుండా ఏపీపీఎస్సీ ద్వారా  నియమించారని, వీరు మహిళా పోలీసులగా అనర్హులంటూ కోర్టులో కేసులు వేశారు. దానితో ప్రస్తుతం పనిచేస్తున్న మహిళా పోలీసులు పోలీసుశాఖకు సంబంధం లేదని చెప్పి కోర్టుకి అఫడవిట్ దాఖలు చేసి గత ప్రభుత్వంలో ఇదే పోలీసుశాఖ చేతులు దులుపుకుంది.

 దీనితో నాటి నుంచి నేటి వరకూ వీరు గాల్లోనే ఉంటూ వీరి శాఖ కాని శాఖ పోలీసుశాఖ ఉద్యోగులుగానే అనధికారికంగా పనిచేస్తున్నారు. అప్పటి నుంచి కూటమి ప్రభుత్వం వచ్చేంత వరకూ వీరు అర్జీ పెట్టని ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, జిల్లా కలెక్టర్ ఆఖరుకి ఎంపీడీఓలు, వారే పనిచేస్తున్న సచివాలయాల్లోని స్పందనలో కూడా దరఖాస్తులు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటైన దగ్గర నుంచి ఉద్యోగుల తేడా నియామకాలు, సగం సగం పేస్కేలు,  సర్వీసు రెగ్యులరైజేషన్ లో నోషనల్ ఇంక్రిమెంట్లు ఎగ్గొట్టడం, పీఆర్సీ ఇచ్చి ఐఆర్ ఇవ్వకపోవడం, దానికంటే ముందుగా  హెచ్ఆర్ఏల్లో కుదింపులు, మళ్లీ పేస్కేలు అమలు చేసిన తరువాత మళ్లీ మార్పులు, ఇలా అనేక రకాలుగా తాలింపులు చేసుకుంటూ వచ్చింది. దానితో గ్రామ, వార్డు సచివాలయశాఖలోని మహిళా పోలీసులు దేనికీ చెందని వారుగా మిగిలిపోయారు. నాటి నుంచి నేటి వరకూ వారి కష్టాలను ఎప్పటికప్పుడు ఈరోజు-ఈఎన్ఎస్ సమస్యల వారీగా ప్రత్యేక కథనాలు ప్రచరిస్తూ వస్తోంది. ఇపుడు కూడా కథనాలు ప్రచురించడంతో స్పందించిన కూటమి ప్రభుత్వం ఇదే సచివాలయశాఖలోని ఉద్యోగులకు చిన్న చిన్న పదోన్నతులు ఇవ్వడానికి సిద్ద పడింది. 

తరువాత ప్రభుత్వశాఖ లేని ఉద్యోగులుగా ఉండిపోయిన మహిళా పోలీసుల కష్టాలను తీరుస్తామని, వారికి సముచిత స్థానాన్ని కేటాయిస్తామని హోం మంత్రి అనిత విశాఖలో ప్రకటించారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల ముందు హామీ ఇవ్వడంతో ఉద్యోగులు పెద్ద ఎత్తున కూటమి అధికారంలోకి రావడానికి వన్ సైడ్ గా ఓట్లు వేశారు అన్ని ప్రభుత్వశాఖ ఉద్యోగులతోపాటు, అధికంగా సచివాలయ ఉద్యోగులు. ఎన్ని ఒత్తిడులు వచ్చినా.. దానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం ఒక్కొక్క పని చేయడానికి వీలుగా కమిటీలు వేస్తూ ముందుకు వెళుతున్నది. మహిళా పోలీసుల విషయంలో అనుకూలంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని.. ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాలను నిజం చేస్తూ, వాటిపై స్పందిస్తూ.. సచివాలయ ఉద్యోగులకు న్యాయం జరగడానికి మార్గం సుగమం కావడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రకటించినట్టుగానే, ఎన్నికల హామీని నిలబెట్టుకొని ఏ ప్రభుత్వశాఖ లేనటువంటి తమకు ప్రభుత్వశాఖ ఏర్పాటు చేయడంతోపాటు, పదోన్నతులు కల్పించాలని మహిళా పోలీసులకు కోరుతున్నారు. అదే సందర్భంలో కూటమి ప్రభుత్వానికి కూడా మహిళా పోలీసులు ధన్యవాదములు తెలియజేస్తున్నారు. చూడాలి హోం మంత్రి 10-15 రోజుల్లో మహిళాపోలీసులకు సముచిత స్థానం కల్పిస్తామని చేసిన ప్రకటన,భరోసా ఏ స్థాయిలో ప్రభుత్వంలో కార్యరూపంలో దాలుస్తుందనేది. ఎప్పుడు క్యాబినెట్ సమావేశాల ముందుకి వెళ్లి చేసిన ప్రకటనకి అమలు రూపం వస్తుందనేది..!