కూటమి ప్రభుత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఆఖరికి మంత్రులకి కూడా అధికారులు కనీసం మర్యాలు ఇవ్వడం లేదు. పట్టించుకోను కూడా పట్టించుకోవడంలేదు.. అసలు చంద్రబాబు సర్కారు పరిపాలనకు పూర్తిగా అధికారులు వ్యవహరిస్తున్నారు.. వినడానికి వింతగా వున్నా. ఇది ముమ్మాటికీ నిజం. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు కనీసం మర్యాదలు ఇవ్వడం లేదని స్వయంగా ఎమ్మెల్యేలు, ఏంపీలు, మంత్రులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి స్పీకర్ కి ఫిర్యాదు చేయడం.. దానిని ఆయన సీరియస్ గా తీసుకొని ప్రభుత్వ సిఎస్ విజయానంద్ కి చెప్పడం.. దానిపై సీఎస్ గత 2012లోని జీఓనెంబరు 348ని ఉటంకిస్తూ.. అధికారులూ మీరు ప్రజాప్రతినిధులకు మర్యాదలు ఇవ్వాలి.. ప్రోటోకాల్ పాటించాలంటూ ఉత్తర్వులు జారీచేయడం ఇపుడు రాష్ట్రంలోనే చర్చనీయాంశం అవుతోంది. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి అంటేనే అధికారులు అగ్గగ్గలాడుతూ మర్యాదలు చేసి చేతులు కట్టి మరీ దండాలు పెడతారు.. కానీ కూటమి ప్రభుత్వంలో అంతా వ్యతిరేకంగా జరుగుతుండటంతో నేరుగా ఎమ్మెల్యేలు మాకు మర్యాదలు కావాలంటూ ప్రభుత్వానికి మొరపెట్టుకోవడం విశేషం.
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎంగా చంద్రబాబునాయుడు ఉన్నారు కనుక ప్రభుత్వంలోని అన్ని పనులు అవుతాయనుకున్నారు ప్రజాప్రతినిధులు. కానీ వారిని అధికారులు పట్టించుకోవడం మానేయడం ఒకింత ప్రజాప్రతినిధుల అహం మీద దెబ్బ కొట్టినట్టే అయ్యింది. చెప్పిన పనులు చేయకపోవడం, సిఫారసు లేఖలు బుట్టదాఖలు చేయడం, కనీసం ప్రోటోకాల్ పాటించకపోవడం, పార్టీ కార్యకర్తల పనులంటే కనీసం పట్టనట్టు వ్యవహరించడం, స్వయంగా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి చెప్పినా అప్పటికి సరేనంటూ.. చెప్పిన తరువాతనే మరింత విషయాన్ని టైట్ చేయడం కూటమి ప్రభుత్వంపై 75 ప్రభుత్వశాఖల సిబ్బంది సామూహిక తిరుగుబాటు చేస్తున్నట్టుగానే కనిపిస్తుందని విశ్లేషకులు బావిస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలోని కార్యాలయాల్లో అధికారులు కనీసం ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదట. చెప్పనంత వరకూ పనులు చేసి.. చెప్పిన తరువాత కావాలనే టైట్ చేసేస్తున్నారట. దీనితో ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ స్పీకర్ కి ఫిర్యాదు చేయడంతో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ విషయాన్ని ప్రభుత్వ సిఎస్ విజయానంద్ కి దృష్టికి తీసుకెళ్లారు.
దీనితో సిఎస్ వెంటనే గత 2012లోని జీఓనెంబరు 348ని ఉటంకిస్తూ.. ప్రభుత్వ అధికారులంతా ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వాలి.. ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాలి, మర్యాదగా వ్యవహరించాలి.. సిఫారసు లేఖలపై స్పందించాలంటూ ఉత్తర్వులు జారీ చేయడం ఇపుడు రాష్ట్రంలోనే చర్చనీయాంశం అవుతున్నది. అసలు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులను పట్టించుకోకుండా సామూహిక తిరుగుబాటు చేసే వరకూ వచ్చిందంటే ప్రభుత్వం చేసిన, చేస్తున్న తప్పేంటనే అంశంపై ప్రభుత్వంలోని పెద్దలు చాలా తీవ్రంగా ఆలోచనలు చేస్తున్నారట. వాస్తవానికి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి చెందిన నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల మాటలకు, లేఖలకు చాలా పవర్ వుంటుంది. కానీ కూటమి ప్రభుత్వంలో ఆ పవర్ కి ప్రభుత్వ అధికారులు, సిబ్బంది గాలి తీసేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యేలను, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆఖరికి మంత్రులను కూడా పట్టించుకోకపోవడంతో దారుణమని చర్చలు మొదలయ్యాయి. దీనితో అధికారులు తమకు గౌరవం ఇస్తే తప్పా తాము ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు వెళ్లలేమని చెప్పినట్టుగా తెలుస్తుంది. వైఎస్సార్సీపీని కాదని ప్రజలు పట్టం కట్టినా అధికారులు మాత్రం అంటరాని వారిగా ప్రజాప్రతినిధులను చూడటం, వ్యవహరించడం పై సర్వత్రా ఆలోచనలు మొదలయ్యాయి.
-సామూహిక తిరుగుబాటు అధికారులు ఇందుకే చేస్తున్నారా
ఆంధ్రప్రదేశ్ లోని 75 ప్రభుత్వశాఖల్లోని అధికారులు, సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 మంది ఎమ్మెల్యే, 23 మంది ఎంపీలు, 24 మంది మంత్రులపై తిరుగుబాటు చేయడానికి కారణం కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చకపోవడమేనని సామాజిక మాద్యమాల్లో సీఎస్ ఉత్తర్వులు జారీ చేసిన తరువాత ట్రోలింగ్ అవుతున్నది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు చేసిన సిఫారసులు అమలు కాకపోతే వారికి ఎంత మండుతుందో.. మాకూ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే అంతే మండుతుందనే వాదనను ప్రభుత్వ అధికారులు తెరమీదకు తీసుకు వస్తున్నారట. ముఖ్యంగా సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల ను రెగ్యులర్ చేయడం, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్లు అమలు చేయడం, నిర్ధిష్టమై ప్రభుత్వ శాఖలు కేటాయించకపోవడం వంటి అంశాల్లో ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోకపోవడం వలనే ప్రభుత్వశాఖల అధికారులు, సిబ్బంది కూడబలుక్కునే ప్రజాప్రతినిధులకు మర్యాదలు తగ్గించేశారని తెలుస్తున్నది.
అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న తరుణంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం నుంచి ఒక్క ప్రయోజనం లేదని.. పైగా ఆదివారాలు, రెండవ శనివారాలు, సెలవు దినాల్లో కూడా ఊపిరి సలపకుండా పనులు చేయిస్తున్నప్పుడు, ప్రజలకు అవసరంలేని సర్వేలు చేస్తున్న సమయంలో ప్రజల నుంచి పడుతున్న తిట్లు, చీవాట్లకి తామెంత బాధపడతామో కనీసం ప్రభుత్వం గుర్తించకపోతే ఎలాగని అధికారులు, సిబ్బంది సామాజిక మాద్యమాల్లో చర్చించుకుంటున్నారట. ముఖ్యంగా జిల్లా అధికారులకు పదోన్నతులు, ప్రభుత్వం ఇవ్వాల్సిన డిఏలు, వేల సంఖ్యలో ఖాళీలున్నా కొత్తగా సిబ్బందిని నియమించకపోవడం, పనిభారం మొత్తం ఉన్నవారిపైనే పడిపోవడం, ఆ సమయంలో ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు అధికం అయిపోవడం, పనిచేయకపోతే ప్రజాప్రతినిధులు కక్షతీర్చుకున్నట్టుగా వ్యవహించడం వలనే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వడం మానేశారని చెబుతున్నారు. అయినా గౌరవం అంటే జీఓల ద్వారా వస్తుందా..? ప్రభుత్వ సిఎస్ ఆదేశిస్తే ఇస్తారా..? అనే ప్రశ్నలు కూడా ఉద్బవిస్తున్నాయి.
అసలు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ప్రభుత్వంపై ఈ గౌరవం ఇచ్చే విషయంలో తిరుగుబాటు చేయడానికి కారణాలు ఏంటనే విషయం ఆళోచించకుండా.. గౌరవ మర్యాదలు ఇవ్వాలంటూ జీఓ ఇవ్వడం, ప్రోటోకాల్ పాటించాలని ఆదేశించడం చర్చనీయాంశం అవుతున్నది. ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసిన ఫిర్యాదులపై స్పందించిన స్పీకర్, ప్రభుత్వ సీఎస్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కూడా అంతే వేగంగా స్పందించి ఉంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదని కూడా ఉద్యోగులు సలహాలు ఇస్తున్నారు. ఏది ఏమైనా ఒక విజన్ ఉన్న పరిపాలనా దక్షుడు చంద్రబాబు సీఎంగా ఉన్న రాష్ట్రంలో అధికారులు, సిబ్బంది ప్రజాప్రతినిదులకు మర్యాదలు ఇవ్వకుండా సామూహిక తిరుగుబాటు చేస్తున్న విషయం అందరినీ ఆలోచింపచేస్తున్నది. చూడాలి ఇక ముందు ప్రభుత్వ అధికారుల, సిబ్బంది విషయంలో ప్రభుత్వ నిర్ణయం, ప్రజాప్రతినిధుల తీరు ఎలా ఉండబోతుందో..?!