కూటమి ప్రభుత్వంలోనూ వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలకు ఏడాది..!


Ens Balu
21
visakhapatnam
2025-06-04 20:13:20

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోలేదనుకుంటే.. నేడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు ఏడాది కాలంలో పట్టించుకున్న దాఖలాలు అయితే కపించడం లేదు. జర్నలిస్టులు ఏం పాపం చేశారనో వారికి గత ప్రభుత్వమూ.. ఈ ప్రభుత్వమూ కనీసం ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయడానికి ముందుకి రాలేదు. కానీ ప్రభుత్వాలకు ప్రచారం కల్పించడానికి, రాజకీపార్టీల నిరసనలు తెలియజేయడానికి మాత్రం మీడియా కావాలి. అదే మీడియాని అధికారంలోకి వచ్చిన తరువాత వారి కోసం కనీసం పట్టించుకోరు. ప్రతిపక్షంలో ఉన్నంత కాలం తాము అధికారంలో వస్తే ఇక చూడండి అన్నపార్టీలన్నీ తీరా అధికారంలోకి వచ్చిన తరువాత.. ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నాయి. గత ప్రభుత్వం జీఓ నెంబరు-38ని తీసుకొచ్చి స్థానిక పత్రికలను పాతాళానికి తొక్కేసి సొంత మీడియాకి వందల కోట్ల రూపాయలు ప్రకటనలు ఇచ్చుకుంటే.. ఇపుడు కూటమి ప్రభుత్వం కూడా అందుకు తీసీపోదునా అన్నట్టుగానే వ్యవహరిస్తున్నది. 

కాకపోతే గుడ్డిలో మెల్ల ఏంటంటే ఈసారి కూటమి ప్రభుత్వంలో స్థానిక పత్రికలకు అదీ ఎంపానల్ మెంటు ఉన్న పత్రికలకు మాత్రమే కొద్దో గొప్పో ప్రకటనలు ఇస్తున్నది. మళ్లీ ఎంపానల్ మెంట్ లేని పత్రికలను పూర్తిగా పక్కన పెట్టేసింది.  ఈ పరిస్థితి గత ప్రభుత్వంలో అస్సలు లేనే లేదు. ఒక దశలో జర్నలిస్టులు అనే వారిని  లేకుండా చేయాలని కూడా ప్రయత్నించింది. కనీసం వారికి ప్రభుత్వం ద్వారా ఇచ్చే గుర్తింపు కార్డు ప్రెస్ అక్రిడిటేషన్ కూడా రాకుండా చూడాలని శక్తివంచన లేకుండా కృషి చేసి సదరు ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీఓలను పక్కాగా అమలు చేసింది. ఇపుడు ఆ జీఓలకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వంలోనైనా జర్నలిస్టులకు, స్థానిక పత్రికలకు అనుకూలంగా కొత్త జీఓలు వస్తాయనుకుంటే వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఆది నుంచి టిడిపి ప్రభుత్వం మీడియామీద, పత్రికల మీద అంత కక్ష, కోపం అయితే పెట్టుకోలేదు. ఆ నమ్మకమే ఇంకా జర్నలిస్టుల్లో వుంది. కాని మీడియా అంటే పెద్ద పత్రికలు, శాటిలైట్ టీవీ ఛానళ్లే కాదు. స్థానికంగా ఉండే పత్రికలను కూడా పత్రికలుగా గుర్తించాలి. 

ఇక్కడ కనీసం కొలమానం దినపత్రికలను అచ్చువేసే విధానం సరిగ్గా జరుగుతుందా లేదా..? కేంద్ర, రాష్ట్రప్రభుత్వ నిబంధనల మేరకు రికార్డులు మెయింటేన్ చేస్తున్నారా..? పత్రికలు ప్రజల్లోకి వెళుతున్నాయా లేదా అనే విషయాలను ఖచ్చితంగా గుర్తించి నిబంధనలు పాటించే పత్రికలు చిన్నగా ప్రభుత్వ ప్రకటనల చేయూత అందిస్తే పత్రికల మనుగడ, జర్నలిస్టుల బ్రతుకు తెరువుకి కాస్త ఊపిరి వస్తుంది. కానీ ప్రభుత్వాలు మాత్రం ఈ విషయంలో కఠినంగానే వ్యవహరిస్తున్నాయి. 75ఏళ్ల స్వాతంత్ర్య భారత దేశంలో కేంద్రప్రభుత్వాలు మేలు చేస్తే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం రాయితీపై ఇచ్చిన రైల్వే పాసులును తొలగించింది. జర్నలిస్టులు ఒకటి అరా చేసే ప్రయాణాలకు రైల్వేకి అంతేమీ లాసు, నష్టం రాదు. కానీ ప్రజలకోసం, ప్రభుత్వ పథకాలకోసం, రాజకీయపార్టీల కోసం పనిచేసే జర్నలిస్టులకు రాయితీ రైల్వే పాసు ఎందుకు అనుకుందో ఏమో దానిని 2019లోనే తొలగించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకున్న నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్థానిక దినపత్రికలకు ప్రెస్ అక్రిడిటేషన్లు పొందకుండా దేశంలో ఎక్కడా లేని నిబంధనలు తీసుకొచ్చి.. అక్రిడిటేషన్లు పదుల సంఖ్య నుంచి నాలుగైదుకి కుదించేసింది. 

గతంలో మండల విలేఖరికి అక్రిడిటేషన్ ఉండేది. ఆ విధానాన్ని తొలగించి నియోజకవర్గ కేంద్రానికి ఒక అక్రిడిటేషన్ విధాన్నాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. ఆ దెబ్బతో చాలా మంది కనీసం గుర్తింపు లేని మీడియా రంగంలో ఎందుకులే అని ఇక్కడి పూర్తిగా బయటకు వెళ్లిపోయారు. కనీసం జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ లు, 60ఏళ్లు దాటితే కనీసం పెన్షన్ వంటి చేయూతనిచ్చే స్కీములు కూడా లేవు. ప్రస్తుతం జర్నలిస్టులకు ప్రభుత్వ హెల్త్ కార్డులు ఉన్నా అదే ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రలుకు బిల్లులు చెల్లించకపోవడంతో అక్కడ సదరు కార్డులపై వైద్యం కూడా చేయడంలేదు. అటు జర్నలిస్టులపై దాడులను నియంత్రించడానికి గతంలో ఉండే అటాక్స్ కమిటీలు కూడా లేవు. జర్నలిస్టుల ప్రధాన సమస్యలపై జర్నలిస్టు సంఘాలను పోరాటాలు చేయమంటే..ఆయా పార్టీలకు అనుకూలంగా కేవలం ప్రచారాల కోసం మాత్రమే కార్యక్రమాలు చేస్తున్నాయి జర్నలిస్టు సంఘాలు. 

ప్రజల సమస్యలను ప్రభుత్వ కార్యక్రమాలను ఎప్పటి కప్పుడు అన్నివర్గాలకు అందించే జర్నలిస్టులు,మీడియా.. ఇపుడు వారి సమస్యలను కూడా వార్తలుగా రాసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అధికారంలోకి వచ్చిన తరువాత జర్నలిస్టులకోసం అమలు చేయకపోవడంతో ఇపుడు కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న సందర్భంగా పరిష్కారం కాని సమస్యలపై వార్తలు రాయాల్సి వస్తున్నది. ప్రజల్లోప్రజలుగా.. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉన్న జర్నరలిస్టుల సమస్యలు కూడా ప్రభుత్వం.. అందునా కూటమి ప్రభుత్వం పట్టించుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 65వేల మంది జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం ప్రభుత్వానికి పెద్ద కష్టమేమీ కాదు. లేదంటే వచ్చే ఏడాది కూడా ఈ సమాయానికి జర్నలిస్టుల సమస్యలకు రెండేళ్లు అని వార్త రాసుకోవడం తప్పా వర్కింగ్ జర్నలిస్టులు ఏమీ చేసుకోలేని స్థితి నేటి జర్నలిస్టులది..?!