తాజావార్తలను మోసుకొచ్చే పేపర్ బయ్స్ రోజు


Ens Balu
36
New Delhi
2022-09-04 02:15:45

తొలి సంధ్యవేళ కోడి కూయకముందే ఇంటి ముందుకు క్షణకాల అతిథిలా తాజావార్తల సమాహారాన్ని చుట్టబెట్టుకొస్తాడు.. జోరువానలోనూ.. ఎముకలు కొరికే చలిలోనూ తానెవరో సమాజానికి కనిపించకుండా సైకిల్‌పై తలుక్కున ఓ మెరుపులా వచ్చి పోతాడు. భాహ్య ప్రపంచంలోని నిత్యనూతన సమాచారాన్ని అందించే తొలి సామాజిక కార్యకర్త అతడు. చీకటి తెరలను చీల్చుకుంటూ పేపర్‌ చేతిలో పెట్టుకుని ప్రతి ఇల్లూ తిరుగుతూ సార్‌.. పేపర్‌ అంటూ వేడి వేడి వార్తలను మన ముంగిటకు చేర్చే కనిపించని వ్యక్తే పేపర్‌ బాయ్‌.. ఒక్కముక్కలో చెప్పాలంటే ఆయన లేనిదే ప్రపంచంలో ఏం జరుగుతోంది తెలియని పరిస్థితి. అలాంటి పేపర్ బాయ్ కి కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఈ అవనిపై ఉందంటే అతిశయోక్తి కాదు.. తొలి పేపర్‌ బాయ్‌గా గుర్తింపు పొందిన బార్నీ ప్లాహెర్డీ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా సెప్టెంబరు 4న అంతర్జాతీయ పేపర్‌బాయ్‌ దినోత్సవం జరుపుతున్నారు.

 అసలు పేపర్ బాయ్ గా గుర్తింపు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం, అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన బెంజుమన్‌ న్యూయార్క్‌సన్‌ పేపర్‌ను విక్రయించేందుకు పేపర్‌బాయ్స్‌ కోసం మొట్టమొదటిసారిగా ప్రకటనను ప్రచురించింది. ఓ నిరుపేద కుటుంబానికి చెందిన బ్లార్నీ సైహార్డీ అనే పదేళ్ల బాలుడు 1833, సెప్టెంబరు 4వ తేదీన మొట్టమొదటి పేపర్‌బాయ్‌గా విధుల్లో చేరారు. పేపర్‌బాయ్‌గా పాఠకుల హృదయాల్లో స్థానం సంపాదించిన బార్నీ పుట్టినరోజు కూడా సెప్టెంబరు 4 కావడంతో ఆ రోజును పేపర్‌ బాయ్స్‌డేగా ప్రకటించారు. అమెరికాలోని హ్యూస్టన్‌లో టెక్సాస్‌ ప్రెస్‌ అసోసియేషన్‌ 125వ వార్షికోత్సవం సందర్భంగా బార్నీ గౌరవార్థం 2005లో అతడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నాటి నుంచి పేపర్‌బాయ్స్‌ డే ప్రాచుర్యంలోకి వచ్చింది. 

అసలు పేపర్‌బాయ్‌ పని అంటే.. ఏదో పేపర్లు తీసుకొని ఉదయం ఇళ్ల వద్ద వేసి వెళ్లిపోతారని అనుకుంటారు అంతా. అయితే ఇందులో ఉన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఎందరో పాత్రికేయులు రేయింబవళ్లు శ్రమించి సేకరించిన వార్తలను సబ్‌ఎడిటర్లు సరిచేసి ముద్రణ ఆమోదయోగ్యంగా మలుస్తారు. ఆ తర్వాత ముద్రించబడ్డ దిన పత్రికలను పాఠకులకు చేరవేయాల్సిన బాధ్యత పేపర్‌బాయ్‌లదే. తెల్లవారు జామున 3.30 గంటలకు ముందే పేపర్‌బాయ్‌లు నిద్రలేచి సైకిల్‌పై బయలుదేరి పేపర్‌ కట్టలు వచ్చే పాయింట్లకు చేరుకుంటారు. దినపత్రికలను సర్దుకున్నాక పై అంతస్థులో ఉన్న ఇళ్లకు పేపర్‌ను ఎగర వేసేందుకు తాడుతోనూ, పేపర్‌నే పొట్లంగా మలిచి ఆ కట్టలను సైకిల్‌పై సర్దుకుని బయలు దేరుతారు. తమ ఖాతాదారులకు పత్రికలు వేసుకుంటూ ముందుకు  సాగిపోతారు.

 పేపర్‌ వేసే క్రమంలో సైకిల్‌ లేదా ద్విచక్ర వాహనం మరమత్తులకు గురవడం, ఆరోగ్యం బాగలేక నిద్రలేవడం ఆలస్యమైతే ఇక తిట్ల దండకాలే. బిల్లులు సకాలంలో వసూలు చేయకపోతే ఏజెంట్లు జీతాలు ఇవ్వడంలో ఇబ్బందులకు గురిచేయడం ఇలా చాలా బాధలే ఉన్నాయి. మన భారతదేశంలో చాలా మంది ప్రముఖులు ఒకప్పుడు పేపర్ బాయ్ గా చేసినవారే, ఇప్పుడు వారెవరో తెలుసుకుందాం, కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసిన దివంగత భారత రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం విద్యార్థి దశలో పేపర్‌బాయ్‌గా పని చేశారు. ఆయన విద్యార్థి దశలో పుస్తకాల ఖర్చుల కోసం తెల్లవారుజామునే లేచి ఇంటింటా పేపరు వేసేవారు. ఇక ప్రఖ్యాత జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత రాపూరి భరద్వాజ కూడా పేపర్‌బాయ్‌గా పని చేశారు. స్వాతంత్రోద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న రోజుల్లో బాలగంగాధర్‌ తిలక్‌ సైతం పీపుల్స్‌వార్‌ పత్రికకు కొన్నాళ్లపాటు పేపర్‌బాయ్‌గా పనిచేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహనీయులు, మహానుబావులు పేపర్‌బాయ్‌లుగా పనిచేసిన వారే. కాబట్టి, పేపర్ బాయ్స్ అందరికి మరొక్కసారి ప్రపంచ పేపర్ బాయ్ రోజు శుభాకాంక్షలు తెలుపుకుందాం.