పబ్జీ నిషేదంపై తీవ్రంగా స్పందిచిన డ్రాగన్...


Ens Balu
4
China
2020-09-03 15:01:13

పబ్జీతో సహా 118 మొబైల్‌ యాప్‌లపై నిషేధం నిర్ణయంతో చైనా ఇన్వెస్టర్లు, సర్వీస్‌ ప్రొవైడర్ల చట్టబద్ధ ప్రయోజనాలను భారత్‌ ఉల్లంఘించిందని డ్రాగన్‌ తీవ్ర అసం తృప్తి వ్యక్తం చేసింది. భారత్‌ నిర్ణయం విచారకరమని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి గో ఫెంగ్‌ అన్నారు. చైనా మొబైల్‌ యాప్‌లను భారత్‌ నిషేధించడాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. దేశ భద్రతకు ముప్పుగా మారడంతో పాటు డేటా గోప్యత ఆందోళనలపై పబ్జీ సహా 118 చైనా యాప్‌లను భారత్‌ బుధవారం నిషేధిం చింది. ఒక్కరోజులోనే నిషేదంపై స్పందించిన భారత ప్రజలు లక్షల్లో యాప్ ని తొలగించారు. దీంతో చైనా తీవ్రంగా స్పందించింది. నిషేధిత మొబైల్‌ యాప్‌ల జాబితాలో బైడు, బైడు ఎక్స్‌ప్రెస్‌ ఎడిషన్‌, అలీపే, టెన్సెంట్‌ వాచ్‌లిస్ట్‌, ఫేస్‌యూ, విచాట్‌ రీడింగ్‌, క్యామ్‌కార్డ్‌ సహా పలు యాప్‌లున్నాయి. తాజా నిషేధంతో భారత్‌ నిషేధించిన చైనా యాప్‌ల సంఖ్య 224కు పెరిగింది. గతంలో జూన్‌ 29న టిక్‌టాక్‌, యూసీ బ్రౌజర్‌ సహా 59 చైనా యాప్‌లను ప్రభుత్వం నిషేధించగా భారత్‌-చైనా సరిహద్దుల్లో తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో పబ్జీ సహా 118 చైనా యాప్‌లపై భారత్‌ నిషేధించడం గమనార్హం.