తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా టస్సార్ పట్టు సాగు జరుగుతోందని ఉద్యనావనశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.రామ్మోహన్ తెలియజేశారు. బుధవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో టస్సార్ పట్టుసాగు, ఎగుమతులు ఉన్నాయన్నారు. సుమారు 1200 ఎస్టీ కుటుంబాలతో జిల్లాలో ఈ సాగు చేపడుతున్నామన్నారు. పట్టుతయారీకి సంబంధించిన రైతులను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ప్రస్తుతం ఈరకం పట్టుపై రైతులు కూడా పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకొని సాగుచేయడానికి ముందుకి వస్తున్నారన్నారు. గతంలో హార్టికల్చర్ కు వనరులు, సిబ్బంది తక్కువగా ఉండేవారని, ప్రస్తుతం గ్రామసచివాలయాలు ఏర్పాటైన తరువాత ఆ ఇబ్బందులు తొలగిపోయాయన్నారు. వాణిజ్యపంటలను మరింత ప్రోత్సహించేందుకు ఆర్బీకేల ద్వారా రైతులను చైతన్యవంతం చేస్తున్నట్టు ఆయన వివరించారు.