సచివాలయ అభ్యర్ధులూ ఈ సూచనలు మీకోసమే..
Ens Balu
4
Srikakulam
2020-09-17 15:20:53
గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు జిల్లాలో పూర్తి స్ధాయిలో ఏర్పాట్లు పూర్తి చేసామని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద మౌళికసదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. అభ్యర్ధులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్.టి.సి బస్సులు ఏర్పాట్లు చేసామని అన్నారు. దూర ప్రాంత కేంద్రాలకు వెళ్ళే అభ్యర్ధులకు కూడా రవాణా సౌకర్యంగా ఉండే విధంగా వాహనాలను అధిక ట్రిప్పులు ఏర్పాట్లు చేసామని కలెక్టర్ పేర్కొన్నారు. సచివాలయ పరీక్షార్ధులను ఉద్దేశించి గురు వారం ఒక వీడియో మెసేజ్ ను కలెక్టర్ నివాస్ విడుదల చేస్తూ ప్రతి ఒక్కరూ చక్కగా పరీక్షలు రాసి ఉద్యోగం సంపాదించాలని ఆకాంక్షించారు. సూచనలు ఈ విధంగా ఉన్నాయి.
· పరీక్షల కోసం అభ్యర్ధులకు ఇచ్చిన సూచనలు పక్కాగా పాటించాలి
· రైటింగ్ పాడ్ తీసుకు రావాలి
· అభ్యర్ధులు విధిగా పాస్ పోర్టు, పాన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపు కార్డు, డ్రైవింగు లైసెన్సు వంటి ఏదో ఒక ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డును పరీక్షా కేంద్రానికి తీసుకురావాలి.
·ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్ పై ఫోటో లేకపోయినా, సరిగా కనిపించకపోయినా, బాగా చిన్నదిగా ఉన్నా, ఫోటోపై సంతకం లేకపోయినా గెజిటెడ్ అధికారి సంతకం చేసిన మూడు (3) పాస్ పోర్టు సైజు ఫోటోలను తీసుకు రావాలి. ఫోటోలు తీసుకు రాని వారికి పరీక్షలకు అనుమతించరు.
·అభ్యర్ధులకు థర్మల్ స్క్రీనింగు చేయుటకు ఉదయం 8 గంటల నుండి, మధ్యాహ్నం పరీక్షలకు ఒంటి గంట నుండే అభ్యర్ధులకు పరీక్షా కేంద్రాలలోకి అనుమతి.
· మోబైల్, సెల్ ఫోన్, క్యాలిక్యులేటర్లు, టాబ్లెట్స్, ఐ పాడ్, బ్లూ టూత్, పేజర్స తదితర ఏ ఎలక్ట్రానిక్ పరికరం అనుమతించడం జరగదు. నిబంధనలు అతిక్రమించిన వారిని పరీక్షలకు అనర్హులుగా చేయడం జరుగుతుంది.
·అభ్యర్ధులు కేవలం బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ తో మాత్రమే ప్రశ్నాపత్రం, ఓఎంఆర్ షీట్ పై రాయాలి. ఇతర పెన్నులు వినియోగం చెల్లదు. అటువంటి జవాబు పత్రాలు అనర్హమైనవిగా గుర్తిస్తారు. ప్రశ్నాపత్రం బుక్ లెట్ సిరీస్ (ఏ,బి,సి,డి)ను ఓఎంఆర్ షీట్ లో నిర్ధేశిత ప్రదేశంలో విధిగా నింపాలి.
·అభ్యర్ధులు నిర్ధేశిత ప్రదేశంలో హాల్ టికెట్ నంబరు రాయాలి. కేటాయించిన ప్రదేశంలో సంతకం చేయాలి. ఇన్విజిలేటర్ తో సంతకం చేయించుకోవాలి.
· ఓఎంఆర్ షీట్ ఒరిజినల్, డూప్లికేట్ కాపీలను అభ్యర్ధులకు అందించడం జరుగుతుంది. డూప్లికేట్ కాపీలను అభ్యర్ధులు తీసుకొని వెళ్ళవచ్చును.
·ప్రశ్నాపత్రంపై ఎటువంటి రాతలు ఉండరాదు. జవాబులను సైతం మార్కు చేయరాదు.
·ఓఎంఆర్ షీట్ పై వైట్ నర్ (కరెక్షన్ ఇంక్) లేదా ఇతర మార్కర్లు వినియోగించితే అటువంటి ఓఎంఆర్ షీట్ చెల్లుబాటు కావు
·పరీక్షా రూమ్ లో ఇతర అభ్యర్ధులతో మాట్లాడటం, ఇతర అభ్యర్ధులను డిస్టర్బ్ చేసే వారిని పరీక్షల నుండి అనర్హులుగా పరిగణిస్తారు.
·పరీక్షా కేంద్రంలో ఎటువంటి అసభ్యకర ప్రవర్తనను అనుమతించేది లేదు. అటువంటి అభ్యర్ధులపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం జరుగుతుంది.
·తరచూ మరుగుదొడ్లకు వెళ్ళడానికి అనుమతించడం జరగదు. అత్యవసరమైతే మినహా వెళ్ళరాదు. చూచిరాతలు, ఇతరత్రా కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన ఎడల అనర్హులుగా చేయడం జరుగుతుంది.
·పరీక్షా సమయం 150 నిమిషాలుగా మాత్రమే. ప్రశ్నాపత్రం ఇంగ్లీషు, తెలుగు మాద్యమాల్లో ఉంటుంది.
·నెగిటివ్ మార్కులు : తప్పుగా రాసిన జవాబులకు నెగిటివ్ మార్కులు ఉంటాయని అభ్యర్ధులు గమనించాలి. తప్పుగా నాలుగు జవాబులు రాస్తే ఒక మార్కు పోతుంది.
·పరీక్ష పూర్తి అయ్యే వరకు ఏ అభ్యర్ధిని బయటకు విడిచిపెట్టడం జరగదు.
·సహాయకలులు (స్కైబ్) అవసరమని ముందుగా కోరిన విభిన్న ప్రతిభావంతులకు సహాయకులను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికప్పుడు సహాయకులు అవసరమని కోరితే సమకూర్చడం జరగదు.
· పరీక్షా కేంద్రం వివరాలను https://vsws.ap.gov.in లేదా http://gramasachivalayam.ap.gov.in వెబ్ సైట్ ను సంప్రదించి అభ్యర్ధులు పొందవచ్చును.
·కోవిడ్ దృష్ట్యా సురక్షిత చర్యలు తీసుకోవాలి
· ప్రతి అభ్యర్ధి ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి
·మాస్కు విధిగా ధరించాలి. మాస్కు లేకపోతే పరీక్షా హాల్ లోకి ప్రవేశం లేదు. సొంతంగా శానిటైజర్ తెచ్చుకోవాలి
·ఎవరి తాగు నీరు వారు తీసుకు రావడం ఉత్తమం. ఇతర వ్యక్తులు ఉపయోగించిన వస్తువులు వినియోగించకుండా ఉండవచ్చు. పారదర్శకంగా ఉన్న నీళ్ళ బాటిల్స్ తెచ్చుకోవచ్చు.
· కోవిడ్ లక్షణాలు ఉన్న అభ్యర్ధులు తమ పరిస్ధితిని తెలియజేయాలి. అటువంటి వారికి ఐసోలేషన్ రూమ్ లు ఏర్పాటు
·పరీక్ష రాసే సమయంలో ఎటువంటి అస్వస్తత కనిపించిన పరీక్షల నిర్వాహకులకు తెలియజేయాలి.