చీపురుపల్లి ప్రత్యేక అధికారిగా నిర్మలకుమారి
Ens Balu
8
Vizianagaram
2022-04-20 05:34:41
విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలానికి ప్రత్యేక అధికారిణిగా మత్స్యశాఖ ఉప సం చాలకులు ఎన్.నిర్మల కుమారిని నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి ఉత్తర్వులు జారీచేశారు. ఈమేరకు మీడియాకి ప్రకటన విడుదల చేశారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో భౌగోళికంగా జిల్లా పలు మార్పులకు లోనుకావడంతో జిల్లాలోని మండలాలకు ప్రత్యేక అధికారులను తాజాగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఈ ఉత్తర్వులు జారీచేశారు. పునర్విభజనలో జిల్లా నుంచి కొన్ని మండలాలు పార్వతీపురం మన్యం జిల్లాకు వదులుకోవడం, శ్రీకాకుళం నుంచి కొన్ని మండలాలు జిల్లాలో చేర్చడంతో తాజాగా మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలోని 27 మండలాలు, విజయనగరం నగర పాలకసంస్థ, రాజాం, నెల్లిమర్ల నగర పంచాయతీలకు వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలును ఆయా మండలాల్లో పర్యవేక్షించడం, మండల స్థాయి అధికారులను సమన్వయపరచి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను సమర్ధంగా అమలు చేయడం వంటి కార్యకలాపాలను ప్రత్యేక అధికారులు నిర్వహిస్తారని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. మండలంలో అన్ని శాఖల అధికారులతో సంయుక్త సమావేశాలు నిర్వహించి ఆయా కార్యక్రమాల అమలుపై ప్రతి వారం సమీక్షించి జిల్లా ఉన్నతాధికారులకు నివేదించాల్సి వుంటుందని ఆ ఉత్తర్వుల్లో కలెక్టర్ పేర్కొన్నారు.