సీపీఎస్ రద్దు చేసేవరకూ ఉద్యమిస్తాం..


Ens Balu
4
Visakhapatnam
2022-04-20 07:22:44

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిపిఎస్‌ను రద్దుచేసే వరకు ఉద్యమిస్తామని టీచర్స్‌ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. సిపిఎస్‌ను రద్దుచేస్తామని ఎన్నికల ముందు జగన్మోహన్‌రెడ్డి చేసిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోకపోవడటాన్ని ఆయన తప్పుపట్టారు. నేను విన్నాను, నేను ఉన్నాను. నేను మడమతిప్పను, మాట మార్చను అని పెద్దపెద్ద ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి సిపిఎస్‌ రద్దు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. బుధవారం ఎపి యుటిఎఫ్‌ బైక్‌యాత్ర మద్దిలపాలెంకు ఉదయం 10 గంటలకు చేరుకుంది. ఈ బైక్‌యాత్రకు ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, ఎన్‌.సి.ఇ యూనియన్‌ నాయకులు జి.అరుణ్‌కుమార్‌, సిఐటియు నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం సభ జరిగింది. ఈ సందర్భంగా ఎ.అజశర్మ, ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, జి.అరుణ్‌కుమార్‌ లు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం జనవరి 1న 2004లో పాత పెన్షన్‌ విధానాన్ని రద్దుచేసి నూతన పెన్షన్‌ స్కీంను తీసుకువచ్చిందన్నారు. ఈ ఎన్‌పిఎస్‌ వలన ఉద్యోగులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆనాడే ఉద్యమించినా ప్రభుత్వాలు వెనక్కుతగ్గలేదన్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్కీంలో చేరడం సరైంది కాదని ఆనాడే యుటిఎఫ్‌ వ్యతిరేకించందన్నారు. నేడు ఎన్నికల్లో సిపిఎస్‌ రద్దుచేస్తామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ వాటిని రద్దుచేయలేదన్నారు. పైగా ముఖ్యమంత్రికి తెలియక వాగ్ధానం ఇచ్చారని సర్ధిచెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సిపిఎస్‌ రద్దుకోసం పోరు గర్జన పేరుతో ఈ నెల 18 నుండి రాష్ట్ర వ్యాప్తంగా 4 బైక్‌యాత్రలు జరగటం మంచిపరిణామమన్నారు. ఈ బైక్‌యాత్ర 25కు విజయవాడకు చేరుకుంటాయన్నారు. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా యుటిఎఫ్‌కు సహకరించి ఉద్యమంలోకి వస్తే ప్రభుత్వం దిగరాక తప్పదన్నారు. స్వాగతం పలికిన వారిలో సిఐటియు నాయకులు కె.ఎం.కుమార్‌ మంగళం, పి.వెంకటరావు, అప్పారావు, త్రినాధ్‌, ఐద్వా నాయకులు  కె.కుమారి, లలిత, లక్ష్మి, డివైఎఫ్‌ఐ నాయకులు ఎస్‌.శ్రావణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ బైక్‌యాత్ర ఎన్‌ఏడి, గాజువాక మీదుగా మధ్యాహ్నంకి అనకాపల్లికి చేరుకుంటుందన్నారు. తెలుగుతల్లి విగ్రహానికి ఐవి పూలమాల వేసారు. బైక్‌యాత్రలో పాల్గొన్న టీచర్స్‌కు మజ్జిగ, బిస్కట్స్‌ పంపిణీచేసారు. ఈ బైక్‌యాత్రలో యుటిఎఫ్‌ నాయకులు సిహెచ్‌ రవీంద్ర, బి.గోపీమూర్తి, నాగమణి, అప్పారావు, చిన్నబ్బాయి, రామకృష్ణ, అంబేద్కర్‌, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.