అట్టడుగు వర్గాలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి
Ens Balu
4
Andhra University
2020-09-18 19:04:44
సమాజంలో అట్టడుగు వర్గాలను అభివృద్దిలో మిళితం చేయడం ద్వారా సమ్మిళిత ప్రగతి సాధ్యపడుతుందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. శుక్రవారం ఏయూ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్క్యూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ(సిఎస్ఎస్ఇఐపి) నిర్వహించిన ‘ సోషల్ ఎక్స్క్లూజన్ ఇన్ ఇండియా- రోడ్ మ్యాప్ ఫర్ సోషల్ ఇంక్లూజన్’ వెబినార్ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న పథకాలను పూర్తిస్థాయిలో క్షేత్ర స్థాయిలో అమలు చేయడం ద్వారా సామాజిక వేర్పాటును రూపుమాపడం సాధ్యపడుతుందన్నారు. తద్వారా పేదలు, అట్టడుగు వర్గాలు జీవనంలో మెరుగైన అభివృద్ధి సాకారం అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ దిశగా ముందడుగు వేస్తోందన్నారు. దీనిలో భాగంగా పేదలకు ఉపయుక్తంగా జగనన్న అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, వైఎస్ఆర్ ఆసరా, చేయూత, జగనన్న వసతి దీవెన వంటి పథకాలను ఏర్పాటు చేసి విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. సామాజిక వేర్పాటు ప్రజల హక్కులను దూరం చేస్తోందదని జెఎన్యూ డిల్లీ ఆచార్యులు వై.చిన్నారావు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి వేర్పాటులు, అణచివేతలు ఉన్నాయన్నారు. వీరిని సమాజంలో భాగం చేయడం ఎంతో ప్రధానమన్నారు. ఏయూ ఆంత్రపాలజీ విభాగం విశ్రాంత ఆచార్యులు డాక్టర్ వి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆదివాసీలు నేటికీ ప్రధాన జీవన స్రవంతికి దూరంగా జీవనం సాగిస్తున్నారన్నారు. కులాల వారీగా జనాభా గణన జరగాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కేంద్రం సంచాలకులు ఆచార్య పి.సుబ్బారావు తదితరులు ప్రసంగించారు. సదస్సులో 90 మందికిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు.