చెత్త నుంచి సంపదను తయారుచేసుకోవాలి
Ens Balu
8
Parvathipuram
2022-05-17 09:45:25
చెత్త చెత్తగా ఉంచేయకుండా దానిని సంపదగా మార్చాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. పరిశుభ్రమైన జిల్లా ఆవిర్భావం కావాలని పేర్కొన్నారు. స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా జిల్లా యావత్తూ పరిశుభ్రమైన జిల్లాగా అవతరించాలని ఆయన పిలుపునిస్తూ మంగళవారం సీతానగరం మండలం పెదభోగిల గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రంను తనిఖీ చేశారు. కేంద్రంలో చెత్త సేకరణ, సేంద్రియ ఎరువుగా మార్చే విధానం, మార్కెటింగ్, ప్లాస్టిక్ వస్తువులను వేరుచేసే ప్రక్రియ ఇతర అంశాలను వివరంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చెత్త నుండి సంపద కేంద్రాలు అన్ని పూర్తిస్థాయిలో పని చేయాలని పేర్కొన్నారు. కేంద్రాల పరిధిలో ఉన్న చెత్త శతశాతం సేకరణ జరగాలని, ఈ కేంద్రాలకు తీసుకువచ్చి శాస్త్రీయ విధానంలో ప్రక్రియను చేపట్టి సేంద్రియ ఎరువులుగా మార్చాలని అన్నారు. సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా ఆ పంటలకు మంచి ఆదాయం లభిస్తుంది, రైతులకు సేంద్రియ ఎరువుల వినియోగం తెలియజేయాలని సూచించారు. రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల భూ సారం తగ్గుతుందని, సేంద్రియ ఎరువులు వాడటం వలన భూసారం రోజురోజుకు పెరుగుతుందని కలెక్టర్ అన్నారు. రైతుల్లో అవగాహన పెరగడం వలన ఎరువుల వినియోగం పెరుగుతుందని చెప్పారు. కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది అందరూ చిత్తశుద్ధితో చేయడం వలన ఎక్కువ మొత్తంలో సేంద్రియ ఎరువులు దిగుబడి, మార్కెటింగ్ చేయుటకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆన్లైన్ విధానంలో సైతం సేంద్రియ ఎరువుల కొనుగోలు చేస్తున్న సంఘటనలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. స్వచ్ఛత సంకల్ప వాహనాలను పంచాయతీలు పూర్తిస్థాయిలో వినియోగించాలని, వాటికి డ్రైవర్లను పంచాయతీ నిధుల ద్వారా నియమించు కోవాలని సూచించారు. ప్లాస్టిక్ పదార్థాలను వేరు చేయడం, సరైన విధానంలో ప్రాసెస్ చేసి మార్కెటింగ్ చేయుటకు అవకాశాలను పరిశీలించాలని సూచించారు. సేంద్రియ ఎరువుల వినియోగంపై దృష్టి సారిస్తూ జిల్లా పూర్తిస్థాయిలో పరిశుభ్రమైన వాతావరణంలో ఉండేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగం పెద్ద మొత్తంలో తగ్గాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి కిరణ్ కుమార్, తాహశీల్దార్ అప్పల రాజు, ఆర్. డబ్ల్యు.ఎస్ జెఇ పవన్ కుమార్, ఇఓ ఆర్డీ ప్రసాద్, పంచాయతీ ఈవో వెంకట్, సర్పంచ్ జొన్నాడ థేరీశమ్మ తదితరులు పాల్గొన్నారు.