ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాత్రికేయుల సంక్షేమ మంత్రిత్వ శాఖను నెలకొల్పాలని ఆంధ్ర ప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరపు సాంబశివ నాయుడు డిమాండ్ చేశారు. ఆదివారం విశాఖలోని మాధవధార శ్రీ కనకదుర్గ ఫంక్షన్ హాలులో నిర్వహించిన యూనియన్ ఉత్తరాంధ్ర ప్రతినిధుల సమావేశంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. కనీస వేతనాలకు నోచుకోని పాత్రికేయుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే తాను మరో మారు ఆమరణ దీక్ష చేపడతానని ప్రకటించారు. ఈ సమావేశానికి గౌరవ అతిథులుగా హాజరైన వైసీపీ నేత సనపల బంగార్రాజు, ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ రిజిస్ట్రార్ వెలగపూడి ఉమామహేశ్వర రావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ బెండి వెంకట్రావులు జర్నలిస్టులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర, వివిధ జిల్లాల ప్రతినిధులు,సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.