ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకొని, కర్తవ్య నిర్వహణలో సమర్థతను,శక్తిని, ఉత్సాహన్ని పొందేందుకు జాతీయ మీడియా సదస్సు-2022 నిర్వహించడం జరుగుతుందని ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం పేర్కొంది. సంస్థ ప్రతినిధి బి.కె.రామేశ్వ రి(రమ) ఆధ్వర్యంలో గురువారం విశాఖలోని డాబాగార్డెన్స్ ప్రెస్క్లబ్లో మీడియా సదస్సుకు సంబంధించిన వివరాలను పలువురు అతిధుల ద్వారా వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్కికల్ ఎడ్యూకేషన్ ఆప్పిలేట్ ఆధారిటీ చైర్మన్ ఆచార్య జిఎస్ఎన్ రాజు. గౌరవ అతిధిగా జీవీఎంసీ అదనపు కమిషనర్ డాక్టర్ యాదగిరి శ్రీనివాసరావులు మాట్లాడుతూ నిరంతరం సమాజానికి దిక్సూచిగా వ్యవహరించే జర్నలిస్టులకు ఏటా జాతీయ మీడియా సదస్సు ఏర్పాటు చేసి వారికి అవసరమైన జ్ఞాన సంపదను పంచిపెట్టడం అభినందనీయమన్నారు. మీడియాతోనే ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రజా సమస్యల పరిష్కారానికి అవకాశం కలుగుతుందన్నారు. క్రమం తప్పకుండా ఈ జాతీయ సదస్సు ఏర్పాటు చేయడం, అందులో దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల జర్నలిస్టులను భాగస్వాములను చేయడం ఒక్క బ్రహ్మకుమారీలకే సాధ్యపడిందన్నారు. కార్యక్రమంలో అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా జాతీయ మీడియా సదస్సుకు విశాఖ నుంచి పలువురు జర్నలిస్టులు హాజరు కావడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది కూడా మౌంట్ ఆబూలో జరిగే మీడియా సదస్సుకు హాజరయ్యే జర్నలిస్టులు తమ అక్రిడేషన్, గుర్తింపుకార్డు, ఆధార్కార్డు, జెరాక్స్ ,పాస్పోర్టు సైజ్ ఫోటోను డాబాగార్డెన్స్ ప్రెస్క్లబ్(వైజాగ్ జర్నలిస్టుల ఫోరం) కార్యాలయం పనివేళల్లో ఈనెల 15వ తేదిలోగా సమర్పించి, తమ పేర్లును నమోదు చేసుకోవాలని కోరారు.
ఈ ఏడాది జాతీయ మీడియా సదస్సును ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 2 వరకూ మౌంట్ఆబూ శాంతివనంలో నిర్వహించడం జరుగుతుందని బ్రహ్మకుమారీస్ ప్రతినిధి బి.కె.రామేశ్వరి తెలిపారు. తొలిరోజు సాయంత్రం సదస్సు ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ సమావేశాలు ముగిసిన అనంతరం సర్టిఫీకేట్లు అందజేసి మౌంట్ ఆబూ దర్శనం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ సదస్సుతో జర్నలిస్టులకు తమ జీవితంలో అన్ని విధాలా ముందుకు సాగేందుకు చక్కని విలువలతో కూడిన జీవితం గడిపేందుకు ఉపకరిస్తుందన్నారు. కావున జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామేశ్వరి కోరారు. ఈ సందర్భంగా ఆమె అతిధులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విజెఎఫ్ ఉపాధ్యక్షుడు ఆర్.నాగరాజు పట్నాయక్ స్వాగతం పలకగా, కార్యవర్గ సభ్యులు ఎంఎస్ ఆర్ ప్రసాద్, ఇరోతి ఈశ్వరరావు పాల్గొన్నారు.