అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 15వ తేదీన పుష్పయాగం వైభవంగా జరుగనుంది. జూలై 14వ తేదీ సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు అంకురార్పణం నిర్వహించనున్నారు. జూలై 15వ తేదీ ఉదయం 8.30 నుండి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్ళతో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2.50 నుండి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగం కన్నులపండువగా జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. సాయంత్రం 6 నుండి 7.30 గంటల వరకు పెద్దశేష వాహనంపై స్వామి అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహంచనున్నారు.
ఇటీవల శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. నిత్యకైంకర్యాల్లో గానీ, బ్రహ్మోత్సవాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.