తిరుమలలో జీయంగార్ల చాతుర్మాస దీక్షసంకల్పం


Ens Balu
4
Tirumala
2022-07-13 11:30:40

తిరుమల శ్రీవారి ఆలయంలో బుధ‌వారం శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారి నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం జరిగింది. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి మాట్లాడుతూ శ్రీ వైష్ణ‌వ సంప్ర‌దా‌యక‌ర్త  రామానుజాచార్యుల పారంప‌ర్యంలో చాతుర్మాస దీక్ష విశేషమైంద‌న్నారు. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారని తెలిపారు. కావున ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారని, చాతుర్మాస వ్రతం ప్రాచీనకాలం నుండి ఆచరణలో ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోందని వివరించారు. అనంతరం శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి మాట్లాడుతూ రామానుజాచార్యులవారి వంశపారంపర్య ఆచారంలో భాగంగా గురు పూర్ణిమ ప‌ర్వ‌దినాన ఈ చాతుర్మాస దీక్ష సంకల్పాన్ని చేయడం విశేషమైందిగా భావిస్తారన్నారు.  అంతకుముందు శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్ స్వామి మ‌ఠంలో క‌ల‌శ స్థాప‌న, క‌ల‌శ పూజ‌, విష్వక్సేనారాధన, మేదినిపూజ, మృత్సంగ్రహణం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు. త‌రువాత సేక‌రించిన పుట్టమ‌న్నుకు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి చాతుర్మాస సంక‌ల్పం స్వీక‌రించారు. అనంత‌రం ‌‌శ్రీ పెద్దజీయంగారు తిరుమల బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కనగల జీయంగారి మఠం వద్ద నుండి శ్రీ చిన్నజీయంగారు మరియు ఇతర శిష్యబృందంతో బయల్దేరారు. తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ వరాహస్వామివారిని దర్శించుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాలతో శ్రీవారి ఆలయానికి విచ్చేశారు.  శ్రీవారి ఆలయ మహ‌ద్వారం వ‌ద్ద టిటిడి ఈవో  ఎ.వి.ధ‌ర్మారెడ్డి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు.  జీయంగార్లు శ్రీవారిని దర్శించుకున్న తరువాత పెద్దజీయంగారికి మేల్‌చాట్‌ వస్త్రాన్ని,  చిన్నజీయంగారికి నూలుచాట్‌ వస్త్రాన్ని బహూకరించారు. అనంతరం పెద్దజీయర్‌ మఠంలో  పెద్దజీయర్‌స్వామి,  చిన్నజీయర్‌స్వామి కలిసి ఈవోను శాలువతో సన్మానించారు. 
సిఫార్సు