ఉద్యోగులు సమధర్మ భావనతో మెలగాలి


Ens Balu
2
Tirumala
2022-07-13 13:19:52

సనాతన హిందూ ధర్మ ప్రచార వారధులుగా పనిచేస్తున్న టీటీడీ ఉద్యోగులు సమధర్మ భావనతో మెలగాలని టీటీడీ జెఈవో  సదా భార్గవి పిలుపునిచ్చారు. నిత్య జీవితం, ఉద్యోగ నిర్వహణలో ఒత్తిడిని జయించడానికి శ్వేత, ఒడిశా కు చెందిన జై గంగ లైఫ్ కోచింగ్ అకాడమీ ఆధ్వర్యంలో సీనియర్ ఆఫీసర్లకు శ్వేతలో మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తొలిరోజైన బుధవారం సదా భార్గవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శరీరం, మనసు యాంత్రికంగా మారిన నేటి పరిస్థితుల్లో అధికారులు, ఉద్యోగులకు ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ధర్మ మార్గంలో నడిచే టీటీడీ ఉద్యోగులు తమ మార్గాన్ని మరింత మంచిగా తయారు చేసుకోవచ్చన్నారు. అధికారులు, ఉద్యోగులు ఏ విషయాన్నయినా క్షుణ్ణంగా అర్థం చేసుకుని, మనసుతో పరిష్కార మార్గాలు ఆలోచించాలని సూచించారు. తెలీకుండానే ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారికి సానుకూల ఆలోచనలు, ఒత్తిడిని జయించే శక్తి ,ఆలోచన అవసరమని ఆమె వివరించారు. అహంకారాన్ని పక్కన పెట్టి చేసే ఏపనైనా విజయవంతం అవుతుందని అన్నారు.  జై గంగ లైఫ్ అకాడమీ నిర్వాహకులు కిరణ్ జీ ఒత్తిడిని జయించే మార్గాలపై శిక్షణ ఇచ్చారు. మనిషి అంతర్ముఖం, బాహ్య ముఖం అనే రెండు ప్రపంచాల్లో జీవిస్తున్నారని  కిరణ్ జీ చెప్పారు. క్షమా గుణం అలవరచుకుంటే శారీరకంగా, మానసికంగా ఎలాంటి సమస్యలు లేకుండా జీవించవచ్చని అన్నారు. సంస్థ నిర్వాహకుల్లో ఒకరైన  మంగళ నరాయణి జీ, శ్వేత సంచాలకురాలు  ప్రశాంతి పాల్గొన్నారు.
సిఫార్సు