వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్(ఎల్ఎన్ఏ) అధ్యక్షుడు పి.సత్యనారాయణ డిమాండ్ చేశారు .నగరంలోని ద్వారకానగర్ పౌర గ్రంధాలయంలో అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ నిబంధనలు లోబడి పత్రికలను నిర్వహిస్తున్నప్పటికీ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు జారీ చేయకపోవడం తగదని, పెండింగ్ లో ఉన్న
అక్రిడిటేషన్లను వెంటనే జారీ చేయాలన్నారు. అధికార పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీ మేరకు జర్నలిస్టులకు 300 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. అసోసియేషన్ కార్యదర్శి ధవలేశ్వరపు రవికుమార్ మాట్లాడుతూ కోవిడ్ తో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు
5 లక్షల చొప్పున పరిహారాన్ని వెంటనే చెల్లించాలని కోరారు.
స్థానిక దిన పత్రికలకు, పీరియాడికల్స్ కు సమాచార పౌర సంబంధాల శాఖ యాడ్స్ విడుదల చేసి ఆయా పత్రికలకు చేయూత నివ్వాలన్నారు . సీనియర్ జర్నలిస్టు ఎన్.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రమాద బీమా పథకాన్ని జర్నలిస్టులకు అమలు చేయడం లేదని, జీఎస్టీ నిబంధన వల్ల స్థానిక పత్రికలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే తొలగించాలన్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బి.నారాయణ రావు మాట్లాడుతూ జీవో 142ను సవరించి జర్నలిస్టు సంఘాలకు అక్రిడిటేషన్ కమిటీలలో ప్రాతినిధ్యం కల్పించాలన్నారు.సీనియర్
జర్నలిస్ట్ నేమాల హేమ సుందర రావు మాట్లాడుతూ జర్నలిస్టుల కాలనీలు నిర్మించి అర్హులైన వారందరికీ ఇళ్లు కేటాయించాలని, హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు,
సభ్యులు అర్.అబ్బాస్, చక్రవర్తి , రవికాంత్ ,వెంకట వేణు, తిర్లంగి హరి ,శివప్రసాద్,జి.ఆనంద్ , హరనాథ్,దొండా రమేష్, బాదంగీర్ సాయి, కొణతాల మోహనరావు,
బి.ఏ.నాయుడు,,మొల్లి కమల్ కుమార్ ,వి.గణేష్,నాయుడు యాదవ్,భగవాన్ , ఎం.శ్రీహరి వివిధ పత్రికల సంపాదకులు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.