దిగులు పడకండి పంటలన్నీ కొంటాం


Ens Balu
7
Tirumala
2022-08-25 13:59:28

ఏం దిగులొద్దు మీరు పండించిన పంటలకు  మద్దతు  ధర ఇచ్చి టీటీడీ కొనుగోలు చేస్తుందని టీటీడీ చైర్మన్   వైవి  సుబ్బారెడ్డి ప్రకృతి వ్యవసాయ రైతుకు భరోసా ఇచ్చారు. టీటీడీ శ్వేతా భవనం లో  గురువారం గోశాలల నిర్వాహకులు , ప్రకృతి వ్యవసాయ దారుల శిక్షణా కార్యక్రమం లో పాల్గొన్నారు . అనంతరం శ్వేతా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన పరిశీలించారు.  ఈ సందర్బంగా  తొట్టంబేడు మండలం పూడి గ్రామానికి చెందిన రైతు   జలగం శ్యామ్ టీటీడీ చైర్మన్ తో  మాట్లాడారు . తాను గో ఆధారిత వ్యవసాయం తో బియ్యం, కొన్ని రకాల కూరగాయలు పండిస్తున్నానని చెప్పారు . ఖర్చు ఎక్కువ అవుతోందని , మార్కెటింగ్ ఇబ్బందిగా ఉందని వాపోయారు . బియ్యం కొనుగోలు చేయడానికి  జనం పెద్దగా ముందుకు రావడం లేదని , అయినా తాను ప్రకృతి వ్యవసాయమే చేస్తున్నానని ఆవేదన చెందారు . ఈ సందర్బంగా చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ , ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే బియ్యం , బెల్లం ,సెనగలు లాంటి పంటలను టీటీడీ మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందని ధైర్యం చెప్పారు . శ్యాం వద్ద ఉన్న పంట ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు . మరింత మంది రైతులను ప్రోత్సహించాలని  శ్యామ్ కు సూచించారు.  చిత్తూరు జిల్లా ఎస్ ఆర్ పురం మండలం మంగుంట గ్రామానికి చెందిన రైతు శ్రీ శేషాద్రి రెడ్డి  రసాయన ఎరువులు , క్రిమిసంహారక మందులు వాడకుండా తయారు చేసిన బెల్లం చైర్మన్ , ఈవో కు రుచి చూపించారు . తమకు మద్దతు ధర ఇచ్చి చెల్లించి కొనుగోలు చేయాలని కోరారు.

    ఈ  సందర్బంగా రైతులు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన నవధాన్యాలు , ఆకు కూరలు , కూరగాయలతో వేసిన ముగ్గును చైర్మన్ పరిశీలించారు. అంతకు ముందు జరిగిన శిక్షణా కార్యక్రమంలో నోడల్ గోశాలల నిర్వాహకులు  శశిధర్ (నంద గోకులం గోశాల నెల్లూరు )  హరి ప్రభు ( ఇస్కాన్ గోశాల చిన్న గొట్టిగల్లు )  హరి కృష్ణ స్వామి (ముక్తి ధామం గోశాల దువ్వూరు వై ఎస్ ఆర్ జిల్లా )   వెంకట రాఘవులు (ఉంగుటూరు పశ్చిమ గోదావరి జిల్లా ) కు  చైర్మన్ ,టీటీడీ ఈవో పంచగవ్య  మెడిషనల్ కిట్ అందించారు.