శత శాతం బయోమెట్రిక్ హాజరు ఉండాలి


Ens Balu
5
Parvathipuram
2022-09-03 11:17:16

పార్వతీపురం మన్యం జిల్లాలో డెంగ్యూ జ్వరాల నియంత్రణకు పాలకొండలో ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమం చేపట్టాలని జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారిని ఆదేశించారు.  శనివారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో ఫ్యామిలీ డాక్టరు,   బయోమెట్రిక్ హాజరు, ఆసుపత్రి ప్రసవాలు, 108, 102 తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్, వాక్సిన్ ప్రక్రియ, స్కూలు విద్యార్థుల ఆరోగ్యవివరాలు నమోదు, మాతాశిశు వివరాలు నమోదు, ఆసుపత్రుల భవనాలు నిర్మాణం తదితర అంశాలపై  వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కలెక్టరు అంశాలు వారీగా లక్ష్యాలు సమీక్షించారు.  ఈ సంధర్బంగా జిల్లా కలెక్టరు సమీక్ష నిర్వహిస్తూ  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెడుతున్న  కుటుంబ డాక్టరు పధకాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. 

 ఈ పధకంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని,  గ్రామానికి వెళ్లినపుడు అక్కడ సచివాలయం పరిధిలో ప్రజల ఆరోగ్య వివరాలు సంబంధించిన పూర్తి సమాచారంతో గ్రామానికి వెళ్లాలన్నారు.  ఉదయం గ్రామంలో గల దీర్ఝకాల వ్యాధిగ్రస్తులు, రక్తపోటు తదితర వ్యాదులు, మధుమేహం తదితర వ్యాధులతో బాధపడుతున్నవారికి చికిత్సనందించాలని, మద్యాహ్నం  ఇంటింటికి వెళ్లాలని, వైఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన వారి ఆరోగ్యం పరిశీలించాలని, వయోవృద్దులు, నడువలేనివారికి చికిత్స అందించాలని తెలిపారు.  ఆసుపత్రికి, పట్టణాలకు వెళ్లి పొందే వైద్యసేవలు ఇంటి వద్దనే పొందుతున్నామనే సంతృప్తి ప్రజలకు కల్పించాలని తెలిపారు.  

గర్బిణీ స్త్రీల వివరాలు నమోదు, ఆసుపత్రులు ప్రసవాలు తక్కువ కావడంపై అసంతృప్తి వ్యక్తం చేసారు. రావివలస, సీతానగరం తదితర మండలాల ఆసుపత్రులలో ఒక్క ప్రసవం కూడా నమోదు కాకపోవడంపై వివరణ కోరారు. పాలకొండలో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదు కావడంపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేయవలసినదిగా ఆదేశించారు.  ఇంటింటి సర్వే, స్ప్రేయింగు, యాంటీ లార్వా కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు. పాలకొండ రెవిన్యూ డివిజినల్ అధికారి, స్థానిక మున్సిపల్ కమీషనరుకు బాద్యతలు అప్పగించి పనులు పర్యవేక్షించేటట్లు అదేశాలిచ్చారు. 

నూరుశాతం బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని తెలిపారు. హాజరు నమోదు చేయని సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పాఠశాల విద్యార్థుల ఆరోగ్య వివరాలు నమోదు 56 శాతంగాను, ఎన్.సి.డి. సర్వే 70 శాతం గాను ఉందని, కొన్ని మండలాలలో జిల్లా సరాసరి శాతం కూడా నమోదు చేయపోవడంపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పిల్లలకు వ్యాక్సినేషను కార్యక్రమం 42 శాతం ఉందని నూరు శాతం పూర్తిచేయాలని, డేటా అప్ లోడ్ లో యిబ్బందులు ఉంటే వ్రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు. 

108 వాహనాలలో ఎక్కువ ప్రసవాలు జరుగడంపై జిల్లా కలెక్టరు ప్రశ్నించారు. కొన్ని ఆసుపత్రులలో సున్నా ప్రసవాలు నమోదుకాగా  108 వాహనాలలో ప్రసవాలు పెరుగుతుండటంపై ఆయన ఆరా తీశారు. 108లో ప్రసవించిన వారి పూర్తి ఆరోగ్య వివరాలు సమర్పించాలని, ముందుగా వారిని ఆసుపత్రికి తరలించక పోవడానికి గల కారణాలపై నివేదిక సమర్పించాలని సంబంధిత పి.హెచ్.సి. అధికారులను ఆదేశించారు. ప్రతి ప్రసవంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి నివేదించాలని ఆయన ఆదేశించారు. నివేదిక అందిన 24 గంటలలో జిల్లా కలెక్టర్ కు సమర్పించాలని ఆయన ఆదేశించారు. 

జిల్లాలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలటీ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీ, యితర  ఆసుపత్రుల నిర్మాణాల పురోగతిని సమీక్షిస్తూ  చిన్నచిన్న మరమత్తు పనులు గల భవనాలను 10 రోజులలో పూర్తి చేయాలన్నారు. రోడ్లు, భవనాల శాఖ చేపట్టిన పనులను సెప్టెంబరు నెలాఖరుకు పూర్తిచేయాలని తెలిపారు. నిర్మాణాలు పూర్తయిన భవనాలు నాణ్యత విషయంలో వైద్యాధికారులు ముందుగానే తనిఖీ చేసి సంతృప్తిచెందాలన్నారు.  ఈ సమీక్షా సమావేశంలో జిల్లా వైద్యాశాఖాధికారి బి. జగన్నాధరావు, ఆసుపత్రుల సమన్వయాధికారి బి.వాగ్దేవి, జిల్లా మలేరియా అధికారి కె.పైడిరాజు, ఎపిఎంఐడిసి ఇఇ సత్య ప్రభాకర రావు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యాధికారులు, 108, ఇంజనీరింగు సిబ్బంది పాల్గొన్నారు.