నేత్ర దానం చేయడం ద్వారా మరోకరి జీవితంలో వెలుగు నింపిన వారమౌతామని విశాఖజిల్లా జాయింట్ కలెక్టర్ కె.యస్.విశ్వనాథన్ అన్నారు. ఆదివారం ఉదయం ఆర్.కె. బీచ్ కాళీమాత ఆలయం వద్ద నుండి 37 వ జాతీయ నేత్రదాన అవగాహన ర్యాలీని జెసి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ నిర్వహించిన వైద్య ఆరోగ్యశాఖ మరియు అనీల్ నీరు కొండ ఆసుపత్రి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రక్త దానం చేయడం వల్ల ఎంతో మందికి జీవితం నిలబెట్టిన వారవుతారని, నేత్ర దానం చేయడం వల్ల ఇంకోకరి జీవితం లో వెలుగు నింపిన వారమౌతామని అన్నారు. నేత్ర దానం పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఇటువంటి ర్యాలీలు ఎంతో ప్రభావం చూపుతాయని జాయింట్ కలెక్టర్ తెలిపారు.
అంతకు ముందు జాయింట్ కలెక్టర్ కె యస్ విశ్వనాథన్ తన మరణానంతరం తన రెండు కళ్ళు దానం చేస్తున్నట్లు ప్రకటించి అందుకు సంబంధించిన ఫారం లో సంతకం చేశారు.ఈ ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి కె. విజయ లక్ష్మి , పలువురు వైద్యులు, వైద్య శాఖ సిబ్బంది విద్యార్థులు , అధికారులు పాల్గొన్నారు.