మన్యంలో 3వ తేదీన దసరా ఉత్సవాలు


Ens Balu
8
Parvathipuram
2022-09-28 11:48:19

పార్వతీపురం మన్యం జిల్లాలో దసరా ఉత్సవాలు అక్టోబర్ 3వ తేదీన నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. జిల్లా పర్యాటక కౌన్సిల్ సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లా యంత్రాంగం తరపున ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించుటకు ఏర్పాట్లు చేయాలని సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి  చేనేత వస్త్ర ప్రదర్శన - విక్రయం, గిరిజన సాంప్రదాయ వస్తువుల ప్రదర్శన, వన్ ధన్ కేంద్రాల ఉత్పత్తులు, సవర కళాకృతుల ప్రదర్శన, జీసిసి ఉత్పత్తులు, ఆప్కో, అటవీశాఖ, వెదురు ఉత్పత్తుల ప్రదర్శన, ఆహార పదార్థాల విక్రయ ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల ఆటవస్తువులు ఏర్పాటు,  బాణసంచా తదితర కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఆయన సూచించారు. 3వ తేదీ మధ్యాహ్నం నుండి కార్యక్రమం జరుగుతుందని ఆయన వివరించారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఇందులో పాల్గొని ఉత్సవాలను దిగ్విజయం చేయాలని ఆయన అన్నారు. 

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి డా.బి.నవ్య, జిల్లా గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారులు జె. శాంతీశ్వర రావు, జి.మురళి, మునిసిపల్ కమీషనర్ జె.రామ అప్పల నాయుడు, పర్యాటక అధికారి ఎన్. నారాయణ రావు, జిల్లా ఉద్యాన అధికారి కె.ఎస్.ఎన్.రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి లోచర్ల రమేష్, జట్టు సంస్థ వ్యవస్థాపకులు డా.పారినాయుడు తదితరులు పాల్గొన్నారు.