పార్వతీపురం మన్యం జిల్లాలో ఏర్పాటుచేస్తున్న ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా రైతులనుండి ధాన్యం సేకరణకు కావలసిన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేసమందిరం లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్, సివిల్ సప్లైస్, వ్యవసాయ, కోపరేటివ్, బ్యాంకు అధికారులు, మిల్లర్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గత సంవత్సరం ధాన్యం సేకరణ లో జరిగిన లోపాలను సరిదిద్దుకొని సేకరణ పనులు సక్రమంగా జరిగేటట్లు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు . రైతు భరోసా కేంద్రాలలో ధాన్యం తేమ, నాణ్యత చూసే సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, రైతులకు కుడా అవగాహన కల్పించాలన్నారు. ధాన్యం మిల్లుకు వెళ్ళిన తరువాత తేమ,నాణ్యత విషయం లో తేడాలు రాకుండా సేకరణ కార్యక్రమం జరగాలని తెలిపారు. టె
క్నికల్ సహాయకులకు తగిన శిక్షణ ఇవ్వాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా కూలీలు, రవాణా ఎర్పాట్లు చేయాలని తెలిపారు. మిల్లర్ లకు బ్యాంకులలో పెండింగ్ బిల్ల్స్ సంబందించిన పనులు వారం రోజులలో పూర్తి చేయాలన్నారు. వీరఘట్టం మండలం లో మిల్లులు తక్కువగా ఉన్నాయని, పంట ఎక్కువని కావున అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ సకాలంలో అందజేయాలని తెలిపారు. జెసి ఒ.ఆనంద్ మాట్లాడుతూ, ధాన్యం సేకరణకు అవసరమైన సంచులు సిద్దం చేయాలని తెలిపారు. పాత సంచులు కూడా సిద్దం చేసుకోవాలని, మిగిలినవి సేకరించాలని తెలిపారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ దేవులనాయక్ ధాన్యం సేకరణకు రూపొందించిన నివేదికను వివరించారు. కేంద్ర ప్రభుత్యం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్యం వరి పంటకు కనీస మద్దతు ధర కల్పించుటకు ఏ గ్రేడ్ రకానికి క్వింటాకు రెండు వేల అరవై రూపాయలు , సాదారణ రకానికి రెండు వేల నలబై రూపాయలు ప్రకారం చెల్లించ నున్నట్లు తెలిపారు.
జిల్లాలో 71,371 హెక్టార్లలో వరిపంట వేసారని, సుమారు నాలుగు లక్షల మూడువేల మెట్రిక్ టన్నులు దిగుబడి అంచనా వేయగా అందులో మూడులక్షల పదమూడు వేల మెట్రిక్ టన్నులు మార్కెట్ కు రావచ్చని తెలిపారు. 86.5 శాతం ఇ-క్రాప్ బుకింగ్ చేసినట్లు తెలిపారు. ఈ సంవత్సవరం మొత్తం సేకరణ ప్రక్రియ మొబైల్ యాప్ ద్వారానే జరుగుతుందని, మిల్స్ సెలక్షన్ ఆటోమేటిక్ గా రాండమ్ సెలక్షన్ ద్వారా జరుగుతుందని తెలిపారు. ప్రతి ధాన్యం సేకరణ కేంద్రం, రైతు భరోసా కేంద్రం వద్ద ప్రోక్రూర్మెంట్ అసిస్టెంట్ మరియు రూట్ అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. జిల్లాలో తొంబదిఒక్క మిల్లులు ఉన్నాయని, డబ్బదిఎనిమిది లక్షల ముప్పైఒక్కవేల గోనె సంచులు అవసరంకాగా మూడు లక్షల ముప్పదిరెండు వేల సంచులు నిల్వఉన్నట్లు తెలిపారు. జిల్లాలో గల ఏజెన్సీల వద్ద పది ప్రదేశాలలో లక్షా పదివేల నాలుగువందల డబ్బదిమూడు మెట్రిక్ టన్నుల నిల్వసామర్ద్యంగల గొడౌన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
రెవిన్యూ, వ్యవసాయ అధికారులు, ధాన్యం సేకరణ ఏజెన్సీల అధికారులు, సివిల్ సప్లయి అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు ధాన్యం సేకరణ ప్రక్రియలో వారు నిర్వర్తించవలసిన విధులు గూర్చి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు యిచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ జాయింటు డైరెక్టరు రాబర్ట్ పాల్, జిల్లా సివిల్ సప్లయి అధికారి కె.వి.ఎల్.ఎన్.మూర్తి, జిల్లా పరిషత్ సి.ఇ.ఒ. ఎం .అశోక్ కుమార్, మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ బి.కాశీరామ్, జిల్లా కోపరేటివ్ అధికారి బి. సన్యాశినాయుడు, ఎపిఎస్ఐసి రీజనల్ మేనేజర్ ఎస్.రవికుమార్, జి.సి.సి. డివిజినల్ మేనేజర్ జి.సంద్యారాణి ఇతర అధికారులు, మిల్లర్లు పాల్గొన్నారు.