వాణిజ్య బ్యాంకులకు ధీటుగా సహకార బ్యాంకులు


Ens Balu
17
Srikakulam
2022-09-29 08:16:44

రాష్ట్రంలోని వాణిజ్య బ్యాంకులకు ధీటుగా సహకార బ్యాంకులు పనిచేస్తున్నాయని, ఇది శుభపరిణామమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రోసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం స్థానిక జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పాలకవర్గ సభ్యులు, బ్యాంకు అధికారులు, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 2వందల  సహకార బ్యాంకులు పనిచేస్తున్నాయని, అన్ని బ్యాంకులు లాభాల బాటలో నడుస్తున్నామని ఇది శుభసూచికమని తెలిపారు. గతంలో సహకార బ్యాంకులు అఫ్పుల ఊబిలో ఉండేవని, వాటిని లాభాల బాటలో నడిపించేందుకు ప్రభుత్వం ఎంతో కృషిచేసిందని తెలిపారు. తద్వారా రూ.1800కోట్ల ఆర్ధిక లావాదేవీలతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉందని, ఇతర వాణిజ్య బ్యాంకులకు ధీటుగా ఈ బ్యాంకు పనిచేయడం ఆనందదాయకమన్నారు. 20 సంచార ఏటిఎంలతో,   25 బ్రాంచులతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పనిచేస్తుందని అన్నారు.  లాభాపేక్షతో కాకుండా అట్టడుగు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యాంగా సహకార బ్యాంకులు పనిచేస్తున్నాయని తెలిపారు.

 ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ల నిర్మాణానికి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకువస్తే వారికి ప్రభుత్వం తరపున అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తామని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి స్పష్టం చేసారు. గతంలో రైతులకు ప్రభుత్వమే వ్యవసాయ యాంత్రీకరణపై సూచనలిస్తూ యాంత్రీకరణను నిర్ధేశించడం జరిగిందని, ప్రస్తుతం రైతు సంఘాలకు నచ్చిన వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లను 40శాతం రాయితీతో కొనుగోలు చేసుకునే స్వేచ్ఛను రైతులకు కల్పించడం జరిగిందని తెలిపారు. సున్నావడ్డీతో వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లను కొనుగోలు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించామని చెప్పారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు.

 రైతుల సంక్షేమమే రాష్ట్ర సంక్షేమంగా భావిస్తూ రైతులకు అండదండలుగా ఉండేందుకు కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా రైతులకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని, రైతులకు మరింత చేరువ చేసేందుకు ఇ-క్రాప్ రుణాలను మంజూరుకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని అన్నారు. సహకార బ్యాంకులు, ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లు, మార్కెటింగ్ అభివృద్ధిలో తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు నరసన్నపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ కరిమి రాజేశ్వరరావు మంత్రికి దుశ్శాలువ, జ్ఞాపికను అందించి ఘనంగా సత్కరించారు. మాజీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు నరసన్నపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ గత రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత డా.వై.యస్.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోయిందని, ఆ తదుపరి తనయుడు వై.యస్.జగన్మోహన్ రెడ్డి సమర్ధవంతమైన పాలనతో రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు అన్నివిధాల కృషిచేస్తున్నారని తెలిపారు. 

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ కరిమి రాజేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో రూ.1800 కోట్లతో ఇతర బ్యాంకులకు ధీటుగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పనిచేస్తుందని అన్నారు. జిల్లావ్యాప్తంగా 25 సహకార బ్యాంకులు, 49 ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్తలు పనిచేస్తున్నాయని అన్ని లాభాల బాటలో నడుస్తున్నట్లు చెప్పారు. మరో 11 కొత్త బ్రాంచులను ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణ చేయడం జరిగిందని, త్వరలో వాటిని కూడా త్వరలో వినియోగదారులకు అంకితం చేయనున్నట్లు చెప్పారు. అలాగే జిల్లావ్యాప్తంగా 10 ఏటియంలతో పాటు 20 సంచార ఏటిఎంలు పనిచేస్తున్నట్లు మంత్రి వివరించారు. సహకార లక్ష్మీ పథకం ద్వారా 444 రోజులకు చేసే డిపాజిట్లపై 6.60% అత్యధిక వడ్డీని అందిస్తున్న ఏకైక బ్యాంకు కేంద్ర సహకార బ్యాంకు అని, అలాగే అతితక్కువ వడ్డీకే  రైతులకు, స్వయం సహాయక బృందాలకు, బంగారు ఆభరణాలపై మరియు వ్యవసాయ రుణాలను అందిస్తున్న ఏకైక బ్యాంకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అని ఆయన స్పష్టం చేసారు. ఈవేశంలో జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ ఛైర్ పర్సన్ సుగుణ, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ శిమ్మ నేతాజీ, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గ సభ్యులు మిరియాబెల్లి శ్యామసుందర రావు, బొడ్డేపల్లి నారాయణ రావు, గొండు నిర్మల, దండాసి ఎండమ్మ,నడిమింటి రామ్మూర్తి, బంకి లక్ష్మణమూర్తి, ముఖ్య కార్యనిర్వహణాధికారి డి.వరప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి కె.శ్రీధర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.